భారత్-ఇంగ్లండ్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆటలో భారత బౌలర్లు తమ సత్తా చాటారు. ఆల్రౌండర్ అశ్విని బౌలింగ్లో అదరగొట్టాడు. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత బౌలర్లు బ్రిటీష్ ఆటగాళ్లకు చుక్కలు చూపేందుకు సిద్ధమయ్యారు. ఇంగ్లండ్ ఓపెనర్లు కెప్టెన్ కుక్ (46), జెన్నింగ్స్ (112) అద్భుతమైన ఇన్నింగ్స్తో శుభారంభం చేశారు.
ఫలితంగా ఇంగ్లండ్ భారీ స్కోరు చేస్తుందని అనుకునేలోపే జడేజా సంధించిన అద్భుతమైన బంతికి కుక్ పెవిలియన్ చేరాడు. అనంతరం రూట్ (21) కుదురుకున్నట్టే కనిపించినా అశ్విన్ మాయాజాలానికి బోల్తా కొట్టాడు. ఆపై బరిలోకి దిగిన మొయిన్ అలీ (50) జెన్నింగ్స్తో కలిసి కుదురుకున్నాడు. అర్ధసెంచరీ సాధించి ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించేందుకు బాటలు వేశాడు. కానీ స్వీప్ షాట్తో కరుణ్ నాయర్ వికెట్కు పెవిలియన్ చేరాడు.
అనంతరం సెంచరీ సాధించిన జెన్నింగ్స్కు గుడ్ లెంగ్త్ బంతిని సంధించిన అశ్విన్ ఫలితం రాబట్టాడు. పుజారా చక్కని క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం బెయిర్ స్టో (2)కు అశ్విన్కు వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం బెన్ స్టోక్స్ (25), జోస్ బట్లర్ (18) క్రీజులో ఉన్నారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 94 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. భారత బౌలర్లలో 30 ఓవర్లు బౌలింగ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, జడేజా, ఒక వికెట్ సాధించాడు.