పాక్‌పై గెలిస్తే.. గొప్ప గౌరవమే కాదు.. గంగా నదిలో మునిగినంత పుణ్యం: సిద్ధూ

ఆదివారం, 4 జూన్ 2017 (18:24 IST)
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియాకు శుభాశీస్సులు అందజేసిన భారత మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ దాయాదుల సంగ్రామంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఈ మ్యాచ్‌లో టీమిండియా కనుక పాకిస్థాన్‌ జట్టును ఓడిస్తే.. అది టీమిండియాకు గొప్ప గౌరవమవుతుందని, పవిత్ర గంగానదిలో మునిగినంతా పుణ్యం కలుగుతుందని చమత్కరించారు.
 
'పాకిస్థాన్‌పై విజయం సాధించడం నిజంగా గొప్ప గౌరవం. పాకిస్థాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లో గెలిస్తే గంగానదిలో మునిగి సకల పాపాలన్నీ కడిగేసుకున్నట్టే' అని ఆయన వ్యాఖ్యానించారు. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరుగుతున్న దాయాదుల సమరాన్ని సరిహద్దులకు ఇరువైపులా ఉన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఉత్కంఠగా వీక్షిస్తున్న నేపథ్యంలో సిద్దూ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
సిద్ధూ చేసిన ఈ ఒక్క వ్యాఖ్య పాక్‌తో క్రికెట్ సమరాన్ని భారత అభిమానులు ఏ స్థాయిలో చూస్తున్నారో అర్థమవుతుంది. కానీ భావోద్వేగాలను ఈ స్థాయిలో ప్రకటించడం ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చుతుందేమో ఆలోచించాలి.
 

వెబ్దునియా పై చదవండి