భారతీయులు భోజనప్రియులు... వండుదాం.. డబ్బు రాల్చుకుందాం

మంగళవారం, 28 ఫిబ్రవరి 2012 (18:38 IST)
WD
ప్రపంచ ఆహార రంగం దృష్టి అంతా ఇప్పుడు భారతీయ భోజన ప్రియులపైనే ఉంది. రకరకాల దేశీయ సంప్రదాయ వంట దినుసులను విదేశీ వంటలకు కలగలపి సృష్టించిన విభిన్న వంటకాలతో భారతీయులను సంతృప్తి పరిచే పనిలో బిజీగా ఉన్నాయి. ఒక్క దేశీయ దినుసులే కాదు.. మనకంటూ ప్రత్యేకమయిన వంటలను కూడా ఇప్పుడు విదేశీ వంటలకు కలగలిపి, నానారకాల రకాల రుచులను సృష్టించే పనిలో వంటనిపుణులున్నారు.

ఇందులో భాగంగా మన దేశాన్ని సందర్సించే వంటగాళ్ల సంఖ్య బాగా పెరుగుతోంది. ఇటీవల మన దేశానికి వచ్చిన సింగపూర్‌కు చెందిన పాక నిపుణుడు బెంజిమిన్ సెక్ మాట్లాడుతూ విదేశాల్లో భారతీయ వంటకాలకు విశేష ప్రాచుర్యం ఉందన్నారు. తమ దేశస్తులు భారత్‌కు చెందిన క్యాబేజీతో చేసిన వంటకాలను ఇష్టపడతారని తెలిపారు. తమ సింగపూర్ వంటకాలను, భారతీయ వంటకాలతో కలగలిపి ప్రయోగాలు చేసి కొత్త వంటలను సృష్టించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు.

నిజానికి, ఇలా ఒక దేశానికి చెందిన వంటకాలను వేరొక దేశపు వంటకాలతో కలిపి కొత్త రుచులకు ప్రయత్నించడమనేది కొత్త సంగతేమీ కాదు. ఇప్పటికే, ఈ తరహా వంటలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. భారత్-చైనా రుచులు కలగలిసిన 'గోబీ మంచూరియా' ఆ రకమయిన వంటకమే.

WD
ప్రస్తుతం మన దేశపు చికెన్ టిక్కాను సింగపూర్ తరహాలో తయారుచేస్తున్నారు. సింగపూర్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న లక్సా (ఔషధ గుణాలు గల ఒక రకమయిన ఆకుకూర) మిశ్రమంతో చికెన్ ముక్కలను ముంచి, వాటిని నిప్పుల్లో కాల్చివడ్డించేపనిలో వంటగాళ్లున్నారు. 'లక్సా చికెన్' అనే పేరుపెట్టిన దీనికి ఆ దేశంలో మంచి ఆదరణే లభిస్తోంది.

అలాగే, వెల్‌కమ్ హోటల్ వంటగాడు రాజ్‌కమల్ చోప్రా ఇదే లక్సా మిశ్రమాన్ని మన బాసుమతి పులావుతో కలిపి 'లక్సా పులావ్' అనే కొత్త వంటను సృష్టించారు. దీన్ని పెరుగులో తింటే రుచికి దిమ్మతిరిగి పోవాల్సిందేనని అతగాడంటున్నాడు. పెరుగుతున్న ఆదాయాల కారణంగా, ఆయా దేశస్తులు ఎప్పుడూ ఒకే రకమయిన వంటకాలకే గిరిగీసుకుని కూర్చోవడం లేదు. కొత్త కొత్త రుచులను కోరుకుంటున్నారు.

హోటళ్లు, రెస్టారెంటుల్లో కొత్త మెన్యూల కోసం ఆరాతీస్తున్నారు. ఇదే, ఆయా హోటళ్ల ఆలోచనా శైలులను మార్చింది. కొత్త కొత్త ప్రయోగాలు చేసేలా తమ వంటగాళ్లను ప్రోత్సహిస్తున్నాయి. మెక్‌డొనాల్డ్, కెంటకీ ఫ్రైడ్ చికెన్(కెఎఫ్‌సి), పిజ్జా హట్, చికింగ్ లాంటి ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలు ఆయా విదేశీ వంటకాలను మన దేశపు ప్రత్యేక దినుసులతో తయారు చేసి విజయవంతం అయ్యాయి కూడా.

WD
'ఆలూ టిక్కీ' బర్గర్లనేవి ఆ తరహాలో మెక్‌డొనాల్డ్ కంపెనీ చేతుల్లో రూపుదిద్దుకున్నవే. ఇదే కంపెనీ షామీ కబాబ్ అనే మన వంటకానికి విదేశీ శైలిని కలగలిపి 'మెక్‌గ్రిల్' అనే రకాన్ని సృష్టించింది. 15 ఏళ్ల క్రితం భారత్‌లో అడుగుపెట్టిన పిజ్జా హట్ కంపెనీ అయితే, భారతీయతకు పెద్దపీట వేస్తూ ఇప్పటివరకు లెక్కలేనన్ని పిజ్జా రకాలను మార్కెట్లోకి వదిలి విజయవంతమయిందని ఆ కంపెనీ మార్కెటింగ్ అధిపతి సునయ్ భాషిన్ అంటున్నారు.

సేవ్ పూరీ, చెట్టినాడు పన్నీర్, ఛట్‌పటా వెజ్ మసాలా, నింబూ మిర్చీ, చికెన్ ఆచారీ, చికెన్ జల్ఫ్రెజీ, చికెన్ దో ప్యాజాలు ఆ కంపెనీ తయారుచేసిన భారతీయ శైలి పిజ్జా రకాల్లో కొన్ని.

ఇక చికెన్ ఉత్పత్తులకు పేరయిన కెఎఫ్‌సి అయితే, నోట్లో పెట్టుకుంటే చాలు నషాళానికి అంటే మషాలా రుచులతో కొత్త చికెన్ రకాలను ఎన్ని సృష్టించిందో చెప్పనక్కర్లేదు. అందులో భాగంగానే ఈ కంపెనీ ఇటీవల తయారుచేసిన 'గ్రిల్డ్ చికెన్' రకంతో ఆ కంపెనీకి మరికొందరు కస్టమర్లు జతయ్యారు.

WD
ఒక్క చికెన్‌‌తో మాత్రమే కాదు.. చేపలతో కూడా లెక్కలేనన్ని రకాల వంటకాలు ఇప్పుడు చిక్కింగ్ కంపెనీ రెస్టారెంట్లలో అందుబాటులో ఉన్నాయి. రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్లే వంట పరిశ్రమను ఇలాంటి విభిన్నమయిన ప్రయోగాలకు పురిగొలుపుతోంది. మన వంటకాలను నేర్చుకునే క్రమంలో ఆయా దేశాల వంటగాళ్లు తరచు భారతీయ విమానాలెక్కడమనేది ఇటీవలి కాలంలో చాలా మామూలు విషయంగా మారింది.

మన దేశం నుండి ఇలా విదేశీ విమానాలెక్కే వంటగాళ్లూ తక్కువేమీ కాదు. ఆయా విశ్వవిద్యాలయాలు, కంపెనీలు తరచూ నిర్వహించే జ్ఞాన మార్పిడి (నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్) తరహాలో కొన్ని ప్రపంచ శ్రేణి రెస్టారెంటులు, హోటళ్లు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి అంటూ తమ తమ వంటగాళ్లను మార్చుకుంటు సహకరించుకుంటున్నాయి.

రెండు విభిన్నమయిన వంటకాలను కలగలిపితే వచ్చే కొత్త రుచిని వర్ణించడానికి మాటలే చాలవు.. అందుకే మా కళ్లన్నీ కొత్త వంటలను సృష్టించడంపైనే ఉంటాయని మాస్టర్ చెఫ్ ఇండియాకు చెందిన కునాల్ కపూర్ అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి