ఢిల్లీలో దారుణం : ఫ్లాట్‌లో జంట హత్యలు - విగతజీవులుగా తల్లీకొడుకు

ఠాగూర్

గురువారం, 3 జులై 2025 (11:13 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఫ్లాట్‌లో తల్లీ కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. మృతులను లజ్‌పత్ నగర్ పార్ట్‌లో ఉంటున్న రుచికా సేవాని (42), ఆమె కుమారుడు క్రిష్ (14)గా గుర్తించారు. గత రాత్రి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
 
రుచికా భర్రత కుల్దీప్ సేవాని తన భార్యకు, కొడుక్కి పలుమార్లు ఫోన్ చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానంతో రాత్రి ఇంటికి చేరుకున్న ఆయనకు అపార్టుమెంట్ మెట్లపైనే ప్రవేశద్వారం వద్ద రక్తపు మరకలు కనిపించాయి. దీంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురై వెంటనే గత రాత్రి 9.43 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.
 
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్ధలుకొట్టి లోపలికి ప్రవేశించి చూడగా తల్లీ కుమారుడు శవాలై కనిపించారు. పడక గదిలో రుచికా సేవాని మృతదేహం ఉండగా, వాష్ రూమ్‌లో ఆమె కుమారుడు క్రిష్ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. ఇద్దరి శరీరాలపై లోతైన కత్తిపోట్లు ఉన్నాయని, అత్యంత దారుణంగా వారిని హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు