చెన్నై జయదుర్గ ఆలయంలో ప్రసాదంగా బర్గర్లు, పిజ్జాలు, శాండ్‌విచ్‌లు..!

సోమవారం, 27 మార్చి 2017 (14:23 IST)
సాధారణంగా ఆలయాల్లో చక్కెర పొంగలి, గారెలు, పులిహోర వంటి ఆహార పదార్థాలను ప్రసాదంగా ఇస్తుంటారు. అయితే తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలోని ఓ ఆలయంలో మాత్రం భక్తులకు ప్రసాదాలుగా బర్గర్లు, బ్రౌనీలు, శాండ్‌విచ్‌, పఫ్‌లు అందిస్తున్నారట. ఇది నిజమేనా? అని అడుగుతున్నారు కదూ.. అయితే చదవండి. చెన్నై శివార్లలోని పడప్పయ్ ప్రాంతంలో జయదుర్గ అమ్మవారి ఆలయం కొలువై వుంది.
 
ఈ ఆలయంలో టూరిస్టులను, స్థానికులను ఆకర్షించే దిశగా పిజ్జాలను అందచేస్తున్నట్లు ఆలయన నిర్వాహకులు వెల్లడించారు. దేవాలయానికి రెగ్యులర్‌గా వచ్చే భక్తుల పుట్టిన రోజు తేదీలతో రిజిస్టర్ నిర్వహిస్తున్నామని, వారి పుట్టిన రోజు నాడు బర్త్ డే కేకును ప్రసాదంగా పంపుతున్నామని తెలిపారు.
 
ఇకపోతే.. ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పరిశీలిస్తుంటారు. ఎందుకంటే.. ఈ ఆలయంలో బర్గర్లు, బ్రౌనీలు, శాండ్‌విచ్ వంటి పదార్థాలను ప్రసాదాలుగా ఇస్తారు కాబట్టి. వీటి తయారీతో పాటు ఎంతకాలం ఉపయోగించవచ్చు అనే దానిపై ఆహార భద్రతాధికారులు పరిశీలన చేస్తారట. 
 
బ్రౌనీలు, డెసర్ట్స్ వంటివి ఇవ్వడం ద్వారా భక్తులను సులభంగా ఆకర్షిస్తున్నట్లు జయదుర్గ శక్తిపీఠం ఆలయ నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇంకా పుట్టిన రోజు తేదీలను రిజిస్టర్ చేసుకుని.. భక్తులకు ప్రసాదంగా కేకులను పంపడం ద్వారా.. అమ్మవారి ప్రసాదం తమకు రావడం ద్వారా ప్రత్యేకంగా ఫీలవుతున్నారని నిర్వాహకులు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి