బిగ్ బాస్ తెలుగు సీజన్‌కు క్రేజ్ తగ్గిపోయినట్టేనా?

ఠాగూర్

సోమవారం, 7 అక్టోబరు 2024 (11:09 IST)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గత నెల ఎనిమిదో తేదీన ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఎందుకోగానీ ఈ సీజన్‌కు ముందు నుంచి బిగ్ బాస్‌కు అంత బజ్ లేదు. ఇక సీజన్ ప్రారంభంమయ్యాక కూడా ఎలాంటి ఇంపాక్ట్ లేదు. దానికి కారణం కంటెస్టెంట్స్ అనే టాక్ వినిపించింది. 
 
గత సీజన్‌లో శివాజీ, అమర్ దీప్, శోభాశెట్టి ఇలా.. ఆడియన్స్‌కి బాగా తెలిసిన ముఖాలు కనిపించాయి. ‌సీజన్ 7 గడిచే కొద్ది వ్యూవర్స్‌కు షోపై ఆసక్తి పెరిగింది. కానీ సీజన్ 8లో ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ కంటెస్టెంట్ లేరు. ఏమాత్రం నేమ్ ఫేమ్ లేని కంటెస్టెంట్స్‌లతో ఈ బిగ్ బాస్ 8ని ఏం చూస్తాంలే అనే ధోరణి వ్యూవర్స్‌లో తొలినుంచే ఏర్పడింది. అందుకే వారం వారం‌ షో రేటింగ్ పడిపోతోందనే వార్తలు వినిపించాయి. 
 
ముఖ్యంగా గత సీజన్‌తో పోల్చుకుంటే ఈసారి ఏమాత్రం చెప్పుకోదగ్గ రేటింగ్ కనిపించటం లేదనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఏం పాలుపోలేని స్థితిలో వైల్డ్ కార్డు ఎంట్రీలంటూ హాడావుడి మొదలెట్టారు. తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన వారిలో బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ, బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ మెహబూబ్ షేక్, బిగ్ బాస్ తెలుగు 3 కంటెస్టెంట్ రోహిణి, బిగ్ బాస్ తెలుగు 4 కంటెస్టెంట్స్ అవినాష్, గంగవ్వ, బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ టేస్టీ తేజ, మొదటి సీజన్ కంటెస్టెంట్ నటి హరితేజతో పాటు‌ బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కంటెస్టెంట్ నయని పావని ఇలా మొత్తం ఎనిమిది మంది ఎంట్రీ ఇచ్చారు.
 
ఈ వైల్డ్ కార్డ్‌ల విషయం..‌ వారు షోలోకి ఎంటర్ అవ్వకముందు నుంచే ప్రచారం జరగగా, వ్యూవర్స్‌కు ఏమాత్రం ఇది ఎగ్జైట్‌‌గా అనిపించినట్టుగా కనిపించలేదు. పైగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో చాలామంది నాటి సీజన్‌లలో చివరి వరకు లేరు. గంగవ్వ అయితే హౌస్‌లో ఉండలేక మధ్యలోనే క్విట్ అయింది. కానీ బిగ్ బాస్ 8లో పార్టిసిపేట్ చేసేందుకు ఎవరు ఆసక్తి చూపకపోవటం వల్లో ఏమో కానీ.. మరలా పాత కంటెస్టెంట్స్‌నే దింపారంటూ సోషల్ మీడియాలో‌ ట్రోలింగ్ గట్టిగానే జరుగుతోంది. మొత్తంమీద బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌కు పెద్దగా ఆదరణ కనిపించలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు