ఆంత్రాక్స్ ల‌క్ష‌ణాల‌తో చికిత్స పొందుతూ... ఆసుప‌త్రి నుంచి ప‌రారీ!

శనివారం, 7 మే 2016 (09:11 IST)
ఆంత్రాక్స్ లక్షణాలతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 12 మంది రోగులు ఆసుపత్రి నుంచి పరారయ్యారు. ఏజెన్సీలోని అజ్ఞాత ప్రాంతాలకు తరలివెళ్లారు. తప్పించుకున్న వారందరికి ఆంత్రాక్స్ నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని ఒప్పించి వారి ఇళ్ల వద్దే చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 
 
విశాఖ జిల్లా హుకుంపేట మండలం పనసపుట్టు గ్రామానికి చెందిన 13 మందికి ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో వారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. గత ఏప్రిల్ 2 నుంచి వారు కేజీహెచ్‌లోనే ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం గ్వాలియర్‌కు చెందిన వైద్య బృందం వారి నుంచి శాంపిల్స్‌ను సేకరించింది. వ్యాధి నిర్ధారణ కోసం గ్వాలియర్‌కు శాంపిల్స్‌ను తీసుకువెళ్లారు. ఐతే నెల రోజుల నుంచి కేజీహెచ్‌లో ఉంటున్న ఏజెన్సీ వాసులకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 
 
నిత్యం ఏజెన్సీలో పనుల నిమిత్తం అటుఇటు తిరిగే వారిని ఒక చోట ఉంచడం... ఎవరిని వారి వద్దకు పంపకపోవడంతో గిరిపుత్రులు ఒంటరితనాన్ని ఫీల్ అయ్యారు. దీంతో తెల్లవారుజామున చెప్పాపెట్టకుండా ఏజెన్సీకి పారిపోయారు. తమ ఇళ్లకు వెళితే మరలా అధికారులు వచ్చి విశాఖ తరలిస్తారనే ఉద్దేశ్యంతో వారంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వీరందరికీ ఆంత్రాక్స్ వ్యాధి నిర్ధారణ అయినట్లు గ్వాలియర్ వైద్యులు రిపోర్టు పంపారు. అయితే అప్పటికే గిరిపుత్రులంతా ఏజెన్సీకి పారిపోవడం అజ్ఞాతంలోకి వెళ్లడంతో వారికి ట్రీట్ మెంట్ ఎక్కడ అలా ఇవ్వాలా అనే ఆందోళన అధికారుల్లో నెలకొంది. 
 
ఎండాకాలం కావడంతో ఏజెన్సీలో రాత్రిపూటైనా కొంచెం చల్లగా ఉంటుంది. విశాఖలో విపరీతమైన ఉక్కోపోత ఉండటం, నిత్యం ఏజెన్సీలో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగే వారిని ఒకే గదిలో బంధించినట్లు ఉంచడంతో గిరిపుత్రులు ఇక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం వారిని వెతికిపట్టుకుని చికిత్స అందించే పనిపై జిల్లా వైద్యాధికారులు తలమునకలై ఉన్నారు. మరోవైపు 10 మందికి వ్యాధి నిర్ధారణ కాగా మరో 28 మందికి సంబంధించి వ్యాధిని నిర్ధారించాల్సి ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ మధుసూదనరావు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి