ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 27 నుంచి ప్రచార హోరు.. చంద్రబాబు - జగన్‌ల ప్రచారం ప్రారంభం

వరుణ్

సోమవారం, 25 మార్చి 2024 (11:03 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ అధినేతలు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల కోసం వారు ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు. ఈ నల 27వ తేదీ నుంచి వారు ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర వరకు జగన్ బస్సు యాత్రను చేయనుండగా, ప్రజాగళం పేరుతో చంద్రబాబు కుప్పం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆయన రోజు మూడు నియోజకవర్గాల చొప్పున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆ మేరకు చంద్రబాబు ప్రచార షెడ్యూల్ ఖరారైంది. విచిత్రమేమిటంటే.. వీరిద్దరూ రాయలసీమ ప్రాంతం నుంచి తమ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇరు పార్టీలు దాదాపుగా పూర్తి చేశాయి. దీంతో, ప్రధాన పార్టీల ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది. ఈ నెల 27వ తేదీ సీఎం జగన్, చంద్రబాబు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇద్దరు ప్రధాన నేతలు ఒకేసారి ప్రచారం మొదలుపెట్టనుండటం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేసింది. 
 
సీఎం జగన్ షెడ్యూల్ ఇదీ..
ఇప్పటికే సిద్ధం యాత్ర పేరిట ప్రజల్లో ఉన్న సీఎం జగన్ ఎల్లుండి నుంచీ మేమంతా సిద్ధం పేరుతో ప్రచారం నిర్వహిస్తారు. కడప జిల్లా ఇడుపుల పాయలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఉత్తరాంధ్ర వరకూ కొనసాగుతుంది. 27న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులు అర్పించి ప్రచారం ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. 28వ తేదీన నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖీ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 29న యాత్ర కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.
 
చంద్రబాబు ప్రచారం ఇలా..
మార్చి 27 నుంచి మార్చి 31 వరకూ చంద్రబాబు ప్రచారం కొనసాగనుంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించేలా ప్రచారం షెడ్యూల్ సిద్ధమైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహిస్తారు. 29న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటిస్తారు. నేడు రేపు మాత్రం సొంత నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు