శ్రీశైలంలో తామ్ర శాసనాలను నిశితంగా పరిశీలించిన అమిత్ షా

గురువారం, 12 ఆగస్టు 2021 (15:41 IST)
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శ్రీశైలం ప‌ర్య‌ట‌న అట్ట‌హాసంగా ముగిసింది. ఆయ‌న మ‌ల్లిఖార్జున ఆల‌యంలో చాలా సేపు ఉండి, అక్క‌డి ఘంట మ‌ఠం తామ్ర శాసనాలను నిశితంగా పరిశీలించ‌డం విశేషం.

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం ఆలయం వద్దకు కుటుంబ సమేతంగా విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దంపతులకు ఘన స్వాగ‌తం ల‌భించింది. అర్చకస్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికి కేంద్ర హోం శాఖ మంత్రి దంపతులను ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లను దర్శనం చేయించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆశీర్వచన మండపంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దంపతులకు అర్చక స్వాములు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందించారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, దేవస్థాన ఈవో కేఎస్‌.రామారావు స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించి కేంద్ర హోం శాఖ మంత్రి దంపతులకు అందజేశారు.

శ్రీశైలంలోని పంచమఠాలలో ఒకటైన ఘంట మఠం జీర్ణోద్ధరణ సందర్భంగా లభించిన పురాతన తామ్ర శాసనాలను ఆలయ ప్రాంగణంలో నిశితంగా పరిశీలించారు. శ్రీశైల దేవస్థానం ఆలయ అధికారులు శాసనలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్, దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి వివరించారు. అనంతరం పశ్చిమ మాడ వీధిలో అర్జున మొక్కలును నాటి నీళ్ళు పోశారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెంట ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్ రెడ్డి, డిఐజి వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గారు, దేవస్థాన ఈవో కేఎస్‌.రామారావు, కర్నూల్ ఆర్ డిఓ హరి ప్రసాద్, ఆత్మకూరు డిఎస్పీ శృతి తదితరులున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు