చికెన్ తింటే కరోనా మాయమంటూ ప్రచారం.. కొండెక్కిన ధరలు!

గురువారం, 3 సెప్టెంబరు 2020 (09:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ పది వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ వాలుసుల బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో చికెన్ ఆరగిస్తే కరోనా మాయమైపోతుందనే ప్రచారం సాగుతోంది. దీంతో అనేక మంది చికెన్ కోసం ఎగబడుతున్నారు. ఈ కారణంగా చికెన్ ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చొన్నాయి. 
 
వాస్తవానికి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు జనం వివిధ రకాలైన ఆహారపదార్థాలను తీసుకుంటున్నారు. ఇలాంటివాటిలో కోడి మాంసం, గుడ్డు వినియోగం పెంచారు. అయితే అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. దీనికితోడు చికెన్‌తో కరోనా చెక్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
మరోవైపు, లాక్డౌన్‌ సమయంలో కొన్ని పౌల్ట్రీ కంపెనీలు మూసివేశారు. మరికొన్ని ఉత్పత్తి తగ్గించాయి. రైతులు 80 శాతం వరకు కోళ్ల పెంపకానికి స్వస్తి పలికారు. దీంతో చాలా ఫారాల్లో కోళ్లు లేవు. మరికొన్నిచోట్ల అరకొరగా మాత్రమే వుండడంతో కొరత వచ్చింది. ప్రస్తుతం వున్న మార్కెట్‌ డిమాండ్‌కు కోళ్లు సరిపోవడం లేదు. 
 
ఇలాంటి అనేక కారణాల కారణంగా.. చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కాగా, గురువారం మార్కెట్‌లో విత్‌ స్కిన్‌ కిలో రూ.224, స్కిన్‌లెస్‌ రూ.234గా నిర్ణయించారు. ఈ వారాంతానికి ధర మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కనీసం మరో 15 రోజులకుగానీ కోళ్ల సరఫరా పెరగదని చెబుతున్నారు. 
 
అయితే కరోనా వైరస్‌ వల్ల చికెన్‌ వినియోగం పెరిగినందున, రానున్న పక్షం రోజుల్లో సరఫరా పెరిగినా డిమాండ్‌ను తగ్గట్టు అందించడం కష్టమేనని కోళ్ల రైతు ఒకరు వ్యాఖ్యానించారు. కరోనా వల్ల చికెన్‌ అమ్మకాలు 20 నుంచి 25 శాతం వరకు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు