ప్రైవేట్ హాస్పిటల్స్‌కు అనుమతి రద్దు.. ఎందుకో తెలుసా?

శుక్రవారం, 28 మే 2021 (14:54 IST)
పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోని ప్రైవేటు వైద్యశాలలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పక్క రాష్ట్రమైన తమిళనాడులో అధికారం చేపట్టిన సీఎం స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కరోనా నియంత్రణకు ప్రవేట్ వైద్యశాలలను ప్రభుత్వ అధికారంలోకి తీసుకొని బాధితులకు బెడ్లు కేటాయించారు. ఏపీలో కూడా ఇదే విధంగా ప్రభుత్వం ముందడుగేసి ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలను అరికట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
 
అయితే ఏపీలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఓ వైపు కఠిన కర్ఫ్యూ అమలు చేస్తున్నా వైరస్ వ్యాప్తి ఏ మాత్రం కంట్రోల్ కావడం లేదు. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య 20వేలకు తగ్గడం లేదు. 
 
అలాగే మరణాలు సైతం ప్రతి రోజూ 100 దాటడం కలవరపడేలా చేస్తోంది. కరోనా సోకిన తర్వాత బెడ్లు దొరకని పరిస్థితి చాలా చోట్ల నెలకొంది. రాష్ట్రంలో బెడ్ల కొరతను నివారించటానికి ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్‌కు తాత్కాలిక ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ అనుమతితో పాటు కరోనా చికిత్సకు అనుమతిస్తున్నారు. 
 
అనుమతి పొందిన వైద్యశాలలకు ప్రాణవాయువుతో పాటు రెమిడీసెవెర్ ఇంజెక్షన్స్ వారి వద్ద ఉన్న బెడ్ల సంఖ్యను బట్టి సరఫరా చేస్తున్నారు. అయినా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కాసుల కక్కుర్తితో రెమిడీసెవిర్‌ను బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.
 
ప్రజల ప్రాణ భయాన్ని అవకాశంగా తీసుకున్న ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు, కోవిడ్ బాధితుల వద్ద నుండి లక్షలకు లక్షలు అడ్వాన్స్ కట్టించుకుని మరీ చికిత్స చేస్తున్నారు. పేషెంట్ అదృష్టం బాగుండి బ్రతికి బట్టకడితే అదనంగా మరో రెండు మూడు లక్షలు కట్టించుకుని డిశ్చార్జ్ చేస్తున్నారు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అదే పేషెంట్ మృతి చెందితే ముందుగా కట్టిన అడ్వాన్సు డబ్బు నుండి జమచేసుకోవచ్చు.
 
అంతే కాకుండా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయమంటే చేయలేమంటూ రోగులను కాసులకు వేధిస్తున్న ఘటనలు కోకొల్లలు. ఐతే గుంటూరు జిల్లాలోని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కరోనా వైద్య సేవలు అందించని ఆసుపత్రులకు కరోనా ట్రీట్మెంట్ అనుమతులను రద్దు చేస్తున్నట్లు ఇటీవల జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఐతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ బారిన పడిన ఏ ఒక్కరూ డబ్బులు లేక వైద్యం అందక చనిపోకూడదు అనే సదుద్దేశ్యంతో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చడం జరిగింది. ఐతే ఆచరణలో మాత్రం ఆరోగ్యశ్రీ క్రింద వైద్యం చేస్తున్న హాస్పిటల్స్ దాదాపుగా లేవనే చెప్పాలి. ఆరోగ్యశ్రీ క్రింద ఎవరైనా వైద్యం కోరితే హాస్పిటల్స్ నుండి మొట్టమొదట వచ్చే సమాధానం బెడ్లు ఖాళీలేవు. 
 
డబ్బులు కట్టి చేరిన వారికి మాత్రం బెడ్లు వెంటనే అందుబాటులోకి వస్తున్నాయి. ఐతే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు తాముకట్టించుకునే ఫీజులో ఓ పది శాతం రాయితీ ఇచ్చి వారి పేరుమీద ఆరోగ్యశ్రీ నగదు కూడా కొందరు హాస్పిటల్స్ వారు క్లైమ్ చేసుకుంటున్నారు అనే ఆరోపణలు లేకపోలేదు. ప్రజలను రాబందుల్లా పీక్కుతింటున్న ప్రైవేటు హాస్పిటల్స్‌ని ప్రభుత్వం నియంత్రించలేకపోవడం వల్లనే ప్రజలు కృష్ణపట్నం ఆనందయ్య వంటి వారివైపు పరుగులు తీస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు