శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తుండగా అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగుల గుంపు భక్తులపై మూకుమ్మడిగా దాడి చేశాయి. వివరాల్లోకి వెళితే.. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయడపి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం వై కోట సమీపం గుండాల కోనలోని శివాలయం స్థానికంగా చాలా ప్రసిద్ధి. యేటా ఇక్కడికి శివభక్తులు వస్తుంటారు. బుధవారం శివరాత్రి కావడంతో గుండాల కోన అటవీ ప్రాంతం గుండా 14 మంది శివ భక్తులు సోమవారం రాత్రి దర్శనానికి కాలి నడకన బయలుదేరి వెళ్లారు. అయితే మార్గం మధ్యలో ఏనుగుల గుంపు దాడి చేసింది. మృతులు ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దాడి నుంచి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటనపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. అటవీ శాఖ అధికారులను ఈ ఘటన గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.