26 మందిని జలసమాధి చేసిన చెయ్యేరు వాగు : ఏపీ ప్రభుత్వం వెల్లడి

ఆదివారం, 21 నవంబరు 2021 (14:25 IST)
కడప జిల్లాలోని చెయ్యేరు వాగులో గల్లంతైన 26 మంది జలసమాధి అయినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ వాగులో మృత్యువాతపడిన 26 మృతదేహాల్లో శనివారం 12, ఆదివారం 5 మృతదేహాలను వెలికి తీశారు. మరో గుర్తు తెలియని శవాన్ని కూడా గాలింపు బృందం కనుగొంది. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా మరో 17 మంది గల్లంతయ్యారు. 
 
చెయ్యేరు వాగులో జలసమాధి అయిన మృతదేహాల్లో 15 దేహాలను వెలికితీసి వారివారి కుటుంబ సభ్యులు లేదా బంధువులకు అప్పగించడం జరిగింది. ఈ మృతులంతా కడప జిల్లాలోని చెయ్యేరు వాగు సమీప గ్రామాలైన మండపల్లి, పులపత్తూరు, గుంట్లూరు గ్రామాల వాసులు ఉన్నారు. 
 
కాగా, ఈ నెల 19వ తేదీన కార్తీక పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని చెయ్యేరు వాగులో ఉన్న శివాలయంలో పూజలు చేసేందుకు వెళ్లినపుడు వాగులో ఒక్కసారిగా వరద రావడంతో వీరంతా గల్లంతైన విషయం తెల్సిందే. అయితే, ఈ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇంకా ఆర్థిక సాయాన్ని ప్రకటించలేదు. 
 
కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాలకు విస్తారంగా వర్షాలు కురిసిన విషయం తెల్సిందే.  వర్షాల దెబ్బకు భారీ స్థాయిలో వరద నీరు అనేక ప్రాంతాలను ముంచెత్తింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు