బంద్ పైన దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (17:47 IST)
రాష్ట్రంలో జరుగుతున్న బంద్ పైన దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌తో ఎంవోయూ చేసుకునేందుకు, విశాఖ సమ్మిట్‌కు విదేశీ సంస్థలను ఆహ్వానించేందుకు దుబాయ్ వెళ్లిన ముఖ్యమంత్రి ఒకవైపు ఆయా పనుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు రాష్ట్రంలోని పరిస్థితులను అక్కడ నుంచే ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులతో గురువారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
‘‘బంద్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. జనజీవనానికి ఇబ్బంది లేకుండా చూడాలి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. తాగునీరు, భోజన వసతి కల్పించాలి. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సకాలంలో సక్రమంగా స్పందించాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
 
శాంతియుతంగా బంద్ పాటించేవారికి పోలీసులు సహకరించాలని, ఎటువంటి అణచివేత చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ప్రజల్లో వున్న సెంటిమెంట్‌ను గౌరవించాలంటూ, రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడటం మనందరి బాధ్యతగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘ఏపీకి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. విభజన జరిగి నాలుగేళ్లయినా ఇంకా ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించే హక్కు ప్రజలకు వుంది. ప్రజలను ఇబ్బందుల పాలు చేయకండి. ఎక్కడా ఉద్రిక్తత తలెత్తకుండా చూడాలి. ప్రశాంతంగా బంద్ జరిగేలా చూడాలి’’ అని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
 
‘‘రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తున్నారు. వారికి సంఘీభావంగా ప్రజలు బంద్ పాటిస్తున్నారు. అధికారులు వారికి సహకరించాలి. పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. హింసాత్మక శక్తులు బంద్‌లో ప్రవేశించకుండా చూడాలి. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అన్ని ప్రాంతాలపై నిఘా ముమ్మరం చేయాలి. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించండి. బంద్ ప్రశాంతంగా జరిగేలా సహకరించండి’’ అని ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అధికారులు అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో డిజిపి మాలకొండయ్య, ఇంటలిజెన్స్ ఎ.బి.వెంకటేశ్వరరావు, సీఎంవో కార్యదర్శి రాజమౌళి, రియల్ టైం గవర్నెన్స్ సీఈవో అహ్మద్ బాబు, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు