డిసెంబరు నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి : సీఎం చంద్రబాబు

ఠాగూర్

శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (19:22 IST)
డిసెంబరు నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, కుప్పం ప్రాంతానికి నీళ్లు తరలించి జలహారతి ఇవ్వడంతో తన జన్మ సార్ధకమైందన్నారు. వచ్చే డిసెంబరు నెలాఖరు నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా, నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరవు అనే మాట రాదన్నారు. ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సరైన వినియోగంతో రాష్ట్రంలో 700 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. పదేళ్లలో 439 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చినట్లు తెలిపారు. 
 
'పోలవరం నిర్మాణంలో సమస్యలు అధిగమిస్తూ వచ్చాం. గత పాలనలో ప్రాజెక్టు డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయింది. దీనికి మళ్లీ రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడింది. డిసెంబరు 25 నాటికి పోలవలం డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధార వరకు నీళ్లు తరలించవచ్చు. రూ.960 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తయ్యాయి. అక్టోబరులోనే అనకాపల్లి వరకు ఈ జలాలు తీసుకొస్తాం. రూ.1425 కోట్లతో ఈ ప్రాజెక్టును పోలవరం కుడి కాలువతో అనుసంధానించాం.
 
శ్రీశైలంలో నిల్వ చేసిన నీళ్లు సీమ, హంద్రీనీవా, గాలేరు - నగరికి, మల్యాల నుంచి కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా జలాలు తరలించాం. పులివెందులలోని చెరువులకూ నీళ్లందించాం. హంద్రీనీవా ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేశాం. దీని ద్వారా 40 టీఎంసీల నీళ్లు తరలించగల్గుతున్నాం. హంద్రీనీవా మార్గంలో 6 రిజర్వాయర్లు పూర్తి చేశాం. తుంగభద్ర ప్రాజెక్టులో దెబ్బతిన్న 33 గేట్ల మరమ్మతులు చేశాం. శ్రీశైలం స్పిల్‌వే రక్షణకు రూ.204 కోట్లతో టెండర్లు పిలిచాం. త్వరలో పూర్తిచేస్తాం. సోమశిల ప్రాజెక్టు మరమ్మతులు వచ్చే సీజన్‌కల్లా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు