నీళ్ల సీసా కింద పడకముందే జాగ్రత్తపడాలి... మాజీ సీఎం ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి

బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:33 IST)
నీళ్ల సీసా కింద పడక ముందే జాగ్రత్తపడాలి.. కింద పడి పగిలిపోయిన తర్వాత తిరిగి సీసాలో నీళ్లు పోయలేమని మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. ఇటీవల ఢిల్లీలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన బుధవారం విజయవాడలో తొలిసారి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 
 
ఇందులో ఆయన మాట్లాడుతూ, తాను పదవులు ఆశించి బీజేపీలో చేరలేదన్నారు. తన సేవలు పార్టీకు ఎక్కడ అవసరమైతే అక్కడ పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న అస్తవ్యస్థ నిర్ణయాలపై పార్టీ బాగా నష్టపోయింది. ఒక్కో రాష్ట్రంలో బలహీనపడుతూ వస్తుంది. తనకు పీసీసీ చీఫ్ పదవిని ఆఫర్ చేశారు. సున్నితంగా తిరస్కరించాను. నీళ్ల సీసా కింద పడక ముందే జాగ్రత్తపడాలికదా. కింద పడి పగిలాక నీళ్లను సీసాలో పోయలేమని చెప్పాను. ప్రజలకు మేలు చేయొచ్చనే నమ్మకంతోనే బీజేపీలో చేరా అని చెప్పారు. 
 
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎంతో సాయం అందిస్తుందన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొస్తామన్నారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబటడే పని చేయాల్సి ఉంటుందన్నారు. తన వరకు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ నావేనన్నారు. హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగాను. అక్కడే చదువుకున్నా. అక్కడే ఉంటున్నా. నా తండ్రి సొంతూరు చిత్తూరు జిల్లా. 
 
వాయల్పాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. బెంగళూరులోనూ నాకు ఇల్లు ఉంది. కర్ణాటక కూడా నా స్వస్థలం అనొచ్చు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నివాసం ఉంటాను. పార్టీకి ఎక్కడ పనిచేయమంటే అక్కడ చేస్తా. కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయి. పదవులపై ఎవరితోనూ మాట్లాడలేదు. ఎన్నికల్లో టికెట్‌ ఆశించడం లేదు. నా పోటీపై తుదినిర్ణయం పార్టీ అధిష్టానానిదే. రాజధానిపై పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాను అని నల్లారి కిరమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు