పిఎం, సిఎం సహాయ నిధికి ఏపి గవర్నర్ చేయూత

మంగళవారం, 31 మార్చి 2020 (19:31 IST)
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా విపత్తు నేపధ్యంలో తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర ప్రధమ పౌరుని హోదాలో కరోనా వ్యాప్తి నిరోధం కోసం తన వంతు ప్రయత్నాన్ని చేస్తూనే మఖ్యమంత్రి మొదలు అయా శాఖల ఉన్నతాధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు.

తనకున్న సుదీర్ఘ ప్రజా జీవితం ఆలంబనగా అధికారగణానికి సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని అయా విశ్వ విద్యాలయాల కులపతి హోదాలో విద్యార్ధులను సైతం ఆదిశగా కార్యోన్ముఖులను చేయాలని ఉపకులపతులను ఆదేశించారు. రాష్ట్ర రాజ్యాంగ అధినేతగా అన్ని చేస్తూనే, వ్యక్తిగతంగా కూడా తన పెద్ద మనస్సును చాటుకున్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి సైతం స్వయంగా వివరించిన బిశ్వభూషణ్ రాష్ట్ర ఆరోగ్య స్ధితిగతులను మెరుగుపరిచేందుకు తన వంతుగా చిరు విరాళంను అందిస్తున్నానన్నారు.

విశాలమైన జాతీయ భావాలు కలిగిన హరిచందన్ మరోవైపు ప్రధాని సంరక్షణ నిధికి సైతం తన నెల రోజుల జీతాన్ని విరాళంగా సమకూర్చాలని నిర్ణయించి ఆ మేరకు నిధులను బదిలీ చేయాలని రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష‌కుమర్ మీనాను ఆదేశించారు.

ప్రస్తుత పరిస్ధితులలో ప్రతి ఒక్కరూ దాతృత్వం చూపాలని, దాతలు సమకూర్చే ప్రతి రూపాయి ఈ దేశంలో ఆరోగ్య పరిస్ధితులను మెరుగు పరిచేందుకు ఉపయోగపడుతుందని గవర్నర్ అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి సామాజిక దూరం పాటించటం మాత్రమే కీలక‌మైనందున, ప్రతి ఒక్కరూ తదనుగుణంగా వ్యవహరించాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు