చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఊహించిందే జరిగింది...

గురువారం, 12 అక్టోబరు 2023 (11:48 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో అందరూ ఊహించిందే జరిగింది. ఈ అంశంలో సీఐడీని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుతం జ్యూడీషియల్ రిమాండ్‌లో చంద్రబాబు ఉన్నారు. ఆయన బెయిల్ కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ జరిగింది.
 
ఆ సమయంలో చంద్రబాబు తరపున హాజరైన న్యాయవాదులు ట్రయల్ కోర్టు నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను హైకోర్టుకు తెలిపారు. బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందని తెలిపారు. ఇప్పటికే రెండు రోజుల సీఐడీ కస్టడీలో బాబు ఉన్నారని తెలిపారు. పైగా, స్కిల్ కేసులో నిందితులందరికీ ముందస్తు బెయిల్, బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. కేసు దర్యాప్తు కూడా పూర్తయిందన, చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్‌ కూడా 30 రోజులు దాటిపోయిందని, అందువల్ల చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
 
ఆ తర్వాత సీఐడీ తరపు న్యాయవాదులు స్పందిస్తూ, ఈ అంశంపై తాము ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవాల్సి ఉందని, కౌంటర్ దాఖలు చేస్తామని అందువల్ల తమకు కొంత సమయం కావాలని హైకోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 17వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు