హోం మంత్రి చినరాజప్ప అంటే భయపడుతున్న షుగర్ పేషెంట్లు... ఎందుకో తెలుసా?

గురువారం, 16 నవంబరు 2017 (18:02 IST)
హోం మంత్రి అంటేనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన శాఖ. ఆ శాఖకు మంత్రిగా ఉండే వ్యక్తి ఎంతో హుందాగా ఉండాలి. కానీ ఎపికి చెందిన హోంమంత్రి చినరాజప్ప మాత్రం అలా ఉండరు. తన పేషీకి వచ్చే ఎవరితోనైనాసరే పిచ్చాపాటీ మాట్లాడి గంటల తరబడి కూర్చోబెట్టడం హోంమంత్రికి అలవాటు. అంతేకాదు తన పేషీకి వచ్చే వారందరికీ స్వీట్లు తినిపించడం చినరాజప్పకు అలవాటు. తను ఇచ్చిన స్వీట్లు తినందే ప్రముఖులను అస్సలు పంపించరు. 
 
చినరాజప్ప పేషీలో ఎప్పుడూ గోదావరి జిల్లాల ప్రత్యేకతను చూపించే మిఠాయిలు ఉంటాయి. అందులో పూతరేకులు, ఖాజాలు, లడ్డూలు, కారపూస, జంతికలు ఛాంబర్‌లో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ అవి అయిపోతుంటే వెంటనే తెప్పించేస్తుంటారు.  హోం మంత్రి ఛాంబర్‌కు వెళితేచాలు గుప్పుమని స్వీట్స్ వాసన వస్తుంది. 
 
తన ఛాంబర్‌కు వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అదెవరైనాసరే వారు స్వీట్లు తినందే అస్సలు బయటకు పంపరు. మాకు షుగర్ ఉంది బాబోయ్ వదిలేయండన్నా వినరు చినరాజప్ప. కనీసం ఖాజా అయినా తిని వెళ్ళండి అంటూ బలవంతపెట్టి మరీ తినిపించేస్తున్నారట హోంమంత్రి. నోరు తీపి చేయడం మంచి అలవాటే కదా. కాకపోతే ఈరోజుల్లో షుగర్ పేషెంట్లు ఎక్కువైపోయి రాజప్పకు భయపడుతున్నారు. అంతే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు