నాడు డీజీపీ కార్యాలయం గేటు బయటే అడ్డుకున్నారు.. నేడు ప్రోటోకాల్‌లో స్వాగతం...

వరుణ్

శనివారం, 15 జూన్ 2024 (09:37 IST)
నాడు డీజీపీ కార్యాలయం గేటు బయటే అడ్డుకున్న టీడీపీ అధికార ప్రతినిధి వంగలపూడి అనిత ఇపుడు ఏకం రాష్ట్రానికి హోం మంత్రి అయ్యారు. పైగా, ఇపుడు ఆమెను పోలీసులు ఘ స్వాగతం పలికారు. గతంలో 'మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై డీజీపీకి వినతిపత్రం ఇద్దామని వెళ్తే కార్యాలయం గేటు లోపలకు కూడా అనుమతించకుండా రోడ్డుపైనే అడ్డగించారు. హెడ్‌కానిస్టేబుల్‌కు ఇచ్చి వెళ్లిపోవాలంటూ జులుం చూపారు. ఇదే డీజీపీ కార్యాలయం లోపలకు ప్రొటోకాల్‌తో తనను తీసుకెళ్లే రోజు ఒకటి వస్తుందని అప్పుడే వారికి చెప్పా. చంద్రబాబు ఆశీర్వాదంతో ఇప్పుడు అదే జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను అవమానించిన చోట.. తనను అధికారిక మర్యాదలతో తీసుకెళ్లే రోజు వచ్చింది' అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. 
 
హోంమంత్రిగా నియమితులైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా వైకాపాతో అంటకాగిన పోలీసులు.. తీరు మార్చుకోకపోతే వారినే మార్చేయాల్సి వస్తుందని బహిరంగంగానే హెచ్చరించారు. రాష్ట్రంలో నేరాల రేటు తగ్గిస్తామని, గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేలా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలనే ఆలోచన చేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తామని వివరించారు. 
 
'వైకాపా ప్రభుత్వ అక్రమాలు, అరాచకాలపై పోరాడుతున్నందుకు సామాజిక మాధ్యమాల్లో అత్యంత హేయమైన భాషలో నాపై ట్రోలింగ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టారు. వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్నందుకు తోట చంద్రయ్యను హత్య చేశారు. అలాంటి వారందరికీ శిక్షలు పడేలా చేస్తాం. మహిళలపై జరిగిన అఘాయిత్యాల్లో నిందితులకు శిక్ష పడేలా చేస్తాం. పోలీసులకు ఉన్న బకాయిలను చెల్లిస్తాం' అని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు