లోకేశ్ అంకుల్‌కి పెద్దలను గౌరవించడం తెలియదు : మంత్రి రోజా సెటైర్లు

మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (17:02 IST)
యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఏపీ మంత్రి రోజా తనదైనశైలిలో సెటైర్లు వేశారు. లోకేశ్ అంకుల్‌కి పెద్దలను గౌరవించడం తెలియదన్నారు. ప్రజల ఉన్నతి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తుంటే, ఆయనపై పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారన్నారు. యువగళం పాదయాత్రకు జనం రావడం లేదని, అందుకే చెన్నై, బెంగుళూరు నగరాల నుంచి ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్నారని మంత్రి ఆరోపించారు. 
 
మరోవైపు, మంత్రి రోజాపై నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గాలి భానుప్రకాశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచేంత సీన్ రోజాకు లేదని... ఒక్క ఛాన్స్ అని జగన్ ప్రజలను అడిగినందువల్లే రోజా ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవా చేశారు. ఆడపడుచులకు కూడా తలవంపులు తెచ్చేలా అసెంబ్లీలో రోజా మాట్లాడుతున్నారని ఆమెను చూసి ఎవరూ ఓటు వేయరని అన్నారు. 
 
రోజా కుటుంబ సభ్యులు మన్నార్ గుడి గ్యాంగ్ మాదిరి తయారయ్యారని విమర్శించారు. ఇసుక, మద్యం, మట్టి, గంజాయి అన్ని మాఫియాల్లో రోజా ఉందని ఆరోపించారు. రక్కసిలా తయారైన రోజా నుంచి విముక్తి కోసం సోమవారం లోకేశ్ పాదయాత్రకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారని చెప్పారు. మంత్రి రోజా ప్రెస్మీట్లు పెట్టడం ఆపేసి తన ఐటీ రిటర్నులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు