మద్యం షాపులకు ఎపి సర్కార్ షాక్, ఎందుకంటే?

గురువారం, 17 జూన్ 2021 (23:23 IST)
ఎపిలో మద్యం షాపుల వ్యవహారంపై సర్కార్ ఆగ్రహంగా ఉందట. మద్యం షాపుల అవినీతితో కొత్త చర్యలకు సిద్థమవుతోంది. షాపుల నిర్వహణలో కీలక మార్పులు చేసేందుకు సిద్థమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మద్యం దుకాణాలను ప్రక్షాళన చేసేందుకు ప్రతిపాదనలు సిద్థం చేసింది.
 
ఎపిలో మద్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మద్యం దుకాణాలను నడుపుతోంది. అయినా మద్యం దుకాణాల్లో అక్రమాలు ఆగడం లేదు. విశాఖలో మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది స్థానికంగా ఉన్న ఎక్సైజ్ సిబ్బంది అవకతవకలకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
 
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,984 మద్యం షాపుల్లో తనిఖీలు చేయించింది ప్రభుత్వం, ఈ మేరకు చాలా మద్యం దుకాణాల్లో ఇదే తరహా దందా జరుగుతోందని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందిందట. దీంతో మద్యం షాపుల్లోని సిబ్బందిని వేర్వేరు స్థానాలకు బదిలీ చేయాలనే కీలక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
 
చాలాకాలం పాటు ఒకే షాపులో సిబ్బంది పనిచేస్తుండడంతో వాళ్ళు అధికారులతో కుమ్మక్కవుతున్నట్లు గుర్తించారు. దీంతో సిబ్బందిని బదిలీ చేయాలని నిర్ణయించుకున్నారట. అలాగే మద్యం షాపుల్లో పనిచేసే ప్రతి సేల్స్‌మెన్స్‌‌కు ఇద్దరు ష్యూర్టీలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది.
 
ఇలా చేయడం వల్ల అక్రమార్కులు రెచ్చిపోరని ఎక్సైజ్ శాఖ ఆలోచన. దీంతో పాటు ప్రతి మద్యం దుకాణంలో ఉన్న సిసి కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రతిపాదించారు అధికారులు. ఇదేకాదు మద్యం క్రయవిక్రయాలు, బ్యాంకు డిపాజిట్లు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై నెలకు ఒకసారి ఆడిటింగ్ చేయించాలని నిర్ణయం తీసుకున్నారట. 
 
ఈ మేరకు ఆడిటర్లను ప్రత్యేకంగా నియమించనున్నారట. అలాగే మద్యం బాటిళ్ళపై లేబుళ్ళను స్కానింగ్ చేయకపోవడం వల్ల మద్యం దుకాణాల్లో మద్యం దుకాణాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. దీంతో ఇకపై ప్రతి బాటిల్ ను స్కానింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు