మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాలు బయటకు తీస్తాం : మంత్రి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్

వరుణ్

సోమవారం, 17 జూన్ 2024 (09:34 IST)
పుంగనూరు ఎమ్మెల్యే, వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఐదేళ్ల కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన పాపాలను బయటకు తీస్తామని ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రవాణా, క్రీడలు, యువజన శాఖామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేసిన ఆరాచకాలు, అన్యాయాలు, పాపాలు అన్నింటినీ బయటకు తీస్తాం.. అక్రమంగా తిన్నదంతా కక్కి స్తామని వ్యాఖ్యానించారు. 
 
ఆయన అన్నమయ్య జిల్లా రాయచోటిలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రజల ఆస్తులు, సంపదను దోచుకున్న కుటుంబం పెద్దిరెడ్డిదేనని, పాలు, ఇసుక, మద్యం, ఎర్రచందనం, ఇరిగేషన్, రోడ్డు పనులు దేన్నీ తమ అక్రమ సంపాదన కోసం ఈ కుటుంబం వదలలేదని మంత్రి ఆరోపించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు మండలంలో అనుమతులు లేకుండానే సుమారు 700 కోట్లతో ముది వేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పెద్దిరెడ్డి కుటుంబం నిర్మించిందని పేర్కొన్నారు. 
 
పెద్దిరెడ్డి కుటుంబం రైతుల నుంచి భూములు లాగేసుకుందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేసి బాధిత రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుక క్వారీలు, గ్రానైట్ కంపెనీలను పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా లాక్కుందని, వీటిపైనా విచారణ జరిపిస్తామన్నారు. అక్రమంగా ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తరలించి పక్క రాష్ట్రాలకు అమ్ముకున్న ఘటనలపైనా విచారణ చేసి అందరి చిట్టా బయటకు తెస్తామని మంత్రి హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు