వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

ఠాగూర్

ఆదివారం, 23 మార్చి 2025 (14:17 IST)
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాను ఖతం (ఖాళీ) చేయడమే టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపాలో ద్వితీయ శ్రేణి నాయకులు 150 మందికిపైగా కార్యకర్తలు బీజేపీలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి లక్ష్యం వైకాపాను ఖాళీ చేయడమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 20 శాతం ఓట్లు కూడా రాకుండా చేయడమే మా లక్ష్యమన్నారు. 
 
60 అసెంబ్లీ సీట్లు వచ్చినపుడు సభకు వెళ్లలేదు. ఇపుడు ప్రజలు ఇవ్వకపోతే, ప్రతిపక్ష అర్హత కావాలని అడుగుతున్నారన్నారు. జగన్ వైఖరి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. త్వరలోనే ఒక రూట్ మ్యాప్ ఉంటుందని, అది బహిర్గతంగా కనిపించదన్నారు. ఇపుడు రాష్ట్రంలో విస్తృతమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. 
 
అసెంబ్లీకి వెళ్లను అనే వ్యక్తా ఆంధ్రా ప్రజలకు కావాల్సింది అని ఆయన సూటిగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ నష్టపోవడానికి ప్రధాన కారణం కార్మిక సంఘాల నాయకులేనని ఆరోపించారు. ఎక్కడ నుంచి వచ్చారు... ఎంత ఆస్తులు సంపాదించారు.. ఉద్యమాలు చేస్తూ రెచ్చగొట్టి పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రధాని నరేంద్ర మోడీకి బాగా తెలుసన్నారు. వికసిత భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంతో కూటమి ముందుకు వెళుతుందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు