30 రోజుల్లోనే ఆర్నెల్ల అప్పు : ఏపీ సర్కారు మాయ... తేల్చిన కాగ్

గురువారం, 29 జులై 2021 (11:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులను కుప్పలుతెప్పలుగా చేస్తుందనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఆరు నెలల్లో చేయాల్సిన అప్పును కేవలం 30 రోజులు అంటే నెల రోజుల్లోనే చేసింది. ఈ విషయం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పరిశీలనలో వెల్లడైంది. 
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నెలలోనే రూ.19,717 కోట్లను రుణాల రూపంలో సమీకరించుకుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.19,717 కోట్లను రుణాల రూపంలో సమీకరించుకుని ఖర్చు చేసింది. 
 
ఏడాది మొత్తం మీద రూ.37,079 కోట్లు రుణంగా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో 53.18 శాతం (అంటే ఆర్నెల్ల అప్పు) తొలి నెలలోనే ప్రభుత్వం తీసుకుందని కాగ్‌ పరిశీలనలో తేల్చింది. గతేడాది అది 34.57 శాతంగా ఉందని పేర్కొంది. ప్రతి నెలా కాగ్‌ ప్రభుత్వ లెక్కలను పరిశీలిస్తుంది. 
 
ఎంత ఆదాయం వచ్చింది, ఎంత అప్పు చేసింది, రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు ఎంతెంత అనేది తేలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఏప్రిల్‌ నెల లెక్కలను తాజాగా వెల్లడించింది. నెలనెలా కాగ్‌ విడుదల చేసే ఈ లెక్కలనే నికర రుణపరిమితి పరిశీలనకు ప్రాతిపదికగా తీసుకుంటామని కేంద్రం కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. 
 
ఏప్రిల్‌ నెలలో చేసిన అప్పులో ప్రజా రుణం కింద రూ.3,926.33 కోట్లు, ప్రజా పద్దుగా ఉన్న రూ.15,861 కోట్లు కలిసి ఉంది. ఇలా వచ్చిన మొత్తంలో రూ.73.47 కోట్లు నగదు నిల్వగా ఉండటంతో మొత్తం రుణం రూ.19,714.04 కోట్లుగా లెక్క కట్టారు. పన్ను రాబడి రూ.7,738 కోట్లే ఏప్రిల్‌లో పన్నుల రాబడి మరీ తగ్గిపోయింది. 
 
కేవలం రూ.7,738 కోట్లే దక్కింది. ఇందులో జీఎస్టీ రూ.2,866.14 కోట్లు వచ్చింది. కేంద్ర సాయం రూ.3,630 కోట్లతోపాటు పన్నేతర ఆదాయమూ కలిపితే అది రూ.11,616 కోట్లకు చేరింది. అదేసమయంలో రాష్ట్రంలో ఏప్రిల్‌లో రూ.31,311 కోట్లు ఖర్చు చేశారు. దీనిలో రాబడి రూపేణా వచ్చింది కేవలం 37 శాతమే. అప్పులు, ఇతరత్రా రుణాల రూపంలో సమీకరించింది సుమారు 63 శాతం ఉందని కాగ్ తన నివేదికలో తేల్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు