పీఏలు, పేషీలుగా వారిని చేర్చుకోవద్దు : మంత్రులకు సీఎం చంద్రబాబు హితవు

వరుణ్

గురువారం, 13 జూన్ 2024 (09:22 IST)
గత వైకాపా ప్రభుత్వంలో మంత్రుల వద్ పని చేసిన వారిని పేషీలుగా, ఇతర ఉద్యోగులుగా చేర్చుకోవద్దని తమ పార్టీ తరపున మంత్రులుగా పని చేసిన వారికి పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హితవు పలికారు. బుధవారం ఆయన ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో సమావేశం నిర్వహించారు 
 
ఈ సందర్భంగా వారికి పలు అంశాలపై అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు తేడాలు వివరించారు. ఓఎన్డీలు, పీఏలు, పీఎస్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దని సూచించారు.
 
రాష్ట్రంలో జగన్ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని పిలుపునిచ్చారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదాం అని పేర్కొన్నారు. ఇక, మంత్రులు ఇష్టాయిష్టాలు, వారి సమర్థత మేరకు రేపటి లోగా శాఖలు కేటాయిస్తానని చంద్రబాబు వెల్లడించారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే అని స్పష్టం చేశారు. 
 
ఏపీ మంత్రివర్గం.. పవన్‌కు హోం కాదు.. గ్రామీణాభివృద్ధి!! 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. మంత్రులుగా టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన మొత్తం 22 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారికి ఇంకా శాఖలు కేటాయించాల్సివుంది. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు మంత్రులకు కేటాయించాల్సిన శాఖలు ఏంటన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి పవన్‌కు హోం శాఖ, నాందెండ్ల మనోహర్‌కు వైద్య ఆరోగ్య వంటీ కీలక శాఖలు కేటాయించినట్టు బుధవారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ, ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని, కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలు ఇంకా కేటాయించలేదని గురువారం తేలిపోయింది. పైగా, కొత్త మంత్రులకు గురువారం శాఖలు కేటాయించవచ్చని తెలుస్తుంది. 
 
తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం తిరిగి వస్తారు. ఆ తర్వాత ఆయన శాఖలను కేటాయించనున్నారు. పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే, జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించనున్నట్టు తెలుస్తుంది. పవన్ కోరిక మేరకు గ్రాణీ నేపథ్యంలో ఉన్న శాఖను కేటాయించారని తెలుస్తుంది. లోకే‌శ్‌కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు