కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడలేని అసమర్థ సీఎం జగన్: వంగలపూడి అనిత

మంగళవారం, 11 మే 2021 (13:19 IST)
కరోనా కట్టడిలో, వైరస్ సోకిన రోగులకు వైద్య సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. ఆస్పత్రుల్లో రోగుల ఆర్తనాదాలు ప్రభుత్వ చేతకానితనాన్ని కళ్లకు కడుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ , వెంటిలేటర్లు, మందుల కొరత తీవ్రంగా ఉంది.

కొన్ని ఆస్పత్రుల్లో ఒకే బెడ్ పై ముగ్గురు, నలుగురు చికిత్స తీసుకుంటున్న పరిస్థితి. పక్కనే మృతదేహాన్ని పెట్టుకుని ఆక్సిజన్ పెట్టుంచుకుంటున్న దుస్థుతి. వ్యాక్సిన్ పంపిణీలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు అందుతుందా అంటే అనుమానమే. ఈవైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కుట్ర పూరితంగా చంద్రబాబుపై కేసు పెట్టారు. కరోనా కట్టడి కంటే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసుల నమోదుకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడం హేయం.
 
కరోనా కట్టడి, నివారణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యానికి రాష్ట్ర ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. వైరస్ బారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటం పక్కనపెట్టి ప్రత్యర్థులను వేధించడంపైనే ముఖ్యమంత్రి దృష్టి పెట్టడం దారుణమైన చర్య. కరోనా నివారణకు నిర్ధిష్టమైన ప్రణాళిక రూపొందించుకోకుండా, ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్దం చేయకుండా కేవలం ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతున్నారు.

N440K అనే కొత్త వైరస్ ఆనవాళ్లను కర్నూలులో శాస్త్రవేత్తలు కనిపెట్టారని ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేసిన ప్రతిపక్షనేత చంద్రబాబుపై క్రిమినల్ కేసు పెట్టడం జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వానికి నిదర్శనం. కొత్త వైరస్ పై 50కి పైగా జాతీయ మీడియా సంస్థలు, ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలు, పేరొందిన శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించారు.

పొరుగున తెలంగాణ హైకోర్టు... వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండమని అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మరి వీరందరిపైనా వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతుందా? వైరస్ పైన మాట్లాడిన మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేసినా కేసెందుకు నమోదు చేయలేదు? వైసీపీ నేతలకు ఒక న్యాయం, ప్రతిపక్షాలకు ఒక న్యాయమా? ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో N440K పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను చైతన్య పరచడం ప్రభుత్వానికి తప్పుగా కనిపిస్తోందా?

ఇప్పటికైనా ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలను మానుకుని వైరస్ నివారణ, వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అ 18-45 సంవత్సరాల యువతకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను జగన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు