కాన్పు కోసం ఆస్పత్రికెళితే కడుపులో కాటన్ పెట్టి కుట్లేశారు.. వైద్యురాలి నిర్లక్ష్యం

ఆదివారం, 6 నవంబరు 2016 (10:50 IST)
నెల్లూరులో ఓ ప్రైవేట్ వైద్యురాలి నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్తే ఆ వైద్యురాలు కడుపులో కాటన్‌ (దూది) పెట్టి కుట్లువేసింది. ఈ సంఘటన నెల్లూరులోని నవాబుపేటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గత జూలై 14న లక్ష్మీ శ్రావణి (33) ప్రసవ వేదనతో స్థానిక సులోచనమ్మ నర్సింగ్‌ హోమ్‌కు వచ్చింది. డాక్టర్‌ సులోచన ఆమెకు సిజేరియన్‌ చేసి బిడ్డను బయటకు తీసింది. అయితే శస్త్రచికిత్స సమయంలో కడుపులో దూదిపెట్టి కుట్లు వేశారు. దీంతో దీర్ఘకాలంలో శ్రావణికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో గత నెల 25న ఆమెను నెల్లూరులోని సింహపురి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 
 
అక్కడ స్కానింగ్‌ చేసిన వైద్యులు కడుపులో పెద్ద మొత్తంలో దూది ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స ద్వారా ఆ దూదిని తొలగించడంతో ప్రస్తుతం శ్రావణి కోలుకుంటోంది. దీనిపై బాధిత మహిళ బంధువులు సులోచనమ్మ నర్సింగ్‌ హోమ్‌ వద్ద శనివారం ఆందోళనకు దిగి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

వెబ్దునియా పై చదవండి