నువ్వెవడివిరా... పోరా.. నీకు అన్నీ అయిపోయాయ్ కొడకా! నీ పెత్తనమేంటి?

మంగళవారం, 24 నవంబరు 2020 (08:36 IST)
వైకాపా నేతలు రోడ్డున పడ్డారు. సీనియర్ నేత అనే కనీస మర్యాద కూడా లేకుండా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీపై ఓ జూనియర్ అయిన ఎమ్మెల్యే బూతులతో విరుచుకుపడ్డారు. 'నువ్వెవడివిరా.. పోరా! నీకు అన్నీ అయిపోయాయ్‌ కొడకా! కాకినాడపై నీ పెత్తనమేంట్రా? ఏం మాట్లాడుతున్నావ్‌.. ఏం చేసుకుంటావో చేస్కో' అంటూ మండిపడ్డారు. అంతేనా, టీడీపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్పనూ వదిలిపెట్టలేదు. నోర్మయ్.. నోర్మూసుకుని కోర్చో అంటూ గద్దించాడు. 
 
తూర్పు గోదావరి జిల్లా సమీక్ష (డీఆర్సీ) సమావేశం కాకినాడలో జరిగింది. ఇందులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడైన పిల్లి సుభాష్ చంద్రబోస్‌ (బీసీ నేత)తో పాటు వైకాపా నేత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి చిన్నరాజప్పతో పాటు ఇతరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అధ్యక్షతన డీఆర్‌సీ భేటీ జరిగింది.
 
ఇందులో టిడ్కో ఇళ్ల నిర్మాణం అంశం చర్చకు వచ్చింది. అపుడు ఎంపీ బోస్‌ మాట్లాడుతూ.. కాకినాడ టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగిందని,  లబ్ధిదారుల నుంచి కొందరు లక్షల్లో వసూలు చేశారని ఆరోపించారు. తన సొంత బంధువులే ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చారన్నారు. కాకినాడ మేడ లైన్‌ ప్రాంతంలో అక్రమ కట్టడాలు పెరిగిపోయాయని, దీని వల్లే వర్షాలకు కాకినాడ నగరం మునిగిపోతోందని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా జిల్లావ్యాప్తంగా ఒక నేత మట్టిమాఫియా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. 
 
దీంతో ఎమ్మెల్యే ద్వారంపూడి ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. పిల్లి సుభా్‌షపై బూతులతో విరుచుకుపడ్డారు. టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగితే ఆ జాబితా తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మట్టి మాఫియా ఎక్కడా లేదన్నారు. బోస్‌ స్పందిస్తూ.. తాను కలెక్టర్‌కు లిస్ట్‌ ఇస్తానన్నారు. దీంతో.. మనం అధికారపక్షంలో ఉన్నామా? ప్రతిపక్షంలో ఉన్నామా అంటూ బోస్‌పై ద్వారంపూడి మండిపడ్డారు. టిడ్కో ఇళ్ల అవినీతి అంశంపై మంత్రి బొత్స కూడా తనకు ఫోన్‌ చేశారని.. కాకినాడకు సంబంధించి ఏదైనా ఉంటే తనకు చెప్పక్కర్లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
డీఆర్‌సీ సమావేశం ముగిసి అంతా బయటకు వెళ్తుండగా, ద్వారంపూడి మరోసారి బోస్‌పై విరుచుకుపడ్డారు. ''టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగితే నాకు చెప్పాలి. నేనేం చచ్చిపోలేదు కదా!'' అని మండిపడ్డారు. 'నీకు చెప్పవలసిన అవసరం లేదు' అని బోస్‌ అనడంతో... ద్వారంపూడి మరింత రెచ్చిపోయారు. 'ఏం చేసుకుంటావో చేసుకో! నీకు అన్నీ అయిపోయాయి' అంటూ వేళ్లు చూపిస్తూ హెచ్చరించారు. 
 
దీంతో బోస్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం మాట్లాడుతున్నావ్‌. వెళ్లు’  అంటూ కోప్పడ్డారు. దీంతో ద్వారంపూడి మరింత కోపంతో.. 'కాకినాడ గురించి నీకెందుకు! ఈ నగరంపై నీ పెత్తనమేంటి' అంటూ ఒక బూతు వాడారు. ఒకానొక దశలో బోస్‌పై ఆయన దాడిచేస్తారేమో అన్న భయం అక్కడున్న నేతల్లో పెరిగింది. దీంతో వారంతా ద్వారంపూడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
 
డీఆర్సీ సమావేశంలో టిడ్కో ఇళ్ల అవినీతి గత ప్రభుత్వంలోనే జరిగిందని ద్వారంపూడి ఆవేశంగా ఆరోపించగా...  టీడీపీ పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప జోక్యం చేసుకున్నారు. మీరూ మీరూ తిట్టుకుంటూ మధ్యలో టీడీపీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. దీంతో 'నోర్ముయ్‌. నోరు మూసుకుని కూర్చో' అంటూ ద్వారంపూడి ఆయనపైనా విరుచుకుపడ్డారు. అడ్డొచ్చిన టీడీపీ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల రాజేశ్వరరావును పక్కకు నెట్టేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు