ఆంధ్రప్రదేశ్‌‍లో ఓట్ల పండుగ.. ఖాళీ అయిన భాగ్యనగరం

ఠాగూర్

ఆదివారం, 12 మే 2024 (08:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈ నెల 13వ తేదీన నాలుగో దశ పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభతో పాటు 25 లోక్‌సభ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్‌ రోజున తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల్లో ఉన్న ఓటర్లు స్వరాష్ట్రానికి క్యూకట్టారు. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఓటర్లు తమతమ సొంతూళ్లను శనివారం నుంచే బయలుదేరడంతో జంట నగరాలైన సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాలు ఖాళీ అయ్యాయి. ఏపీ వెళ్లే ప్రయాణికుల కోసం ఉప్పల్, ఎల్పీ నగర్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎంబీబీఎస్ ప్రాంతాల నుంచి వందలాది బస్సులు నడుపుతున్నారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ఏకంగా రెండు వేల బస్సులను ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడిపేలా చర్యలు తీసుకుంది. 
 
హైదరాబాద్ నగరంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షల మంది ప్రజలు ఉంటారు. వారంతా ఇపుడు తమతమ గ్రామాల్లో ఓటు వేసేందుకు ఇంటి బాట పట్టారు. ఫలితంగా హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్టాండులు అత్యంత రద్దీగా మారాయి. బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల కోసం టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి దాదాపు 2 వేల ప్రత్యేక బస్సులను నడుపుతుంది. 
 
ఎంజీబీఎస్ నుంచి 500, ఉప్పల్, ఎల్బీ నగర్, జేబీఎస్ ప్రాంతాల నుంచి 300 బస్సులు చొప్పున నడుపుతున్నారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంది. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని రకాల ప్రజా రవాణా ప్రయాణికిలతో కిక్కిరిసిపోయింది. చాలా మంది సొంత వాహనాల్లో సొంతూళ్లకు బయలుదేరారు. రైల్వే శాఖ ఆది, సోమవారాల్లో సికింద్రాబాద్ - విశాఖ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైలు నడుపుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు