యూకేలో చిక్కుకుపోయిన విద్యార్థులకు సహాయం చేయండి: పవన్ కళ్యాణ్

గురువారం, 2 ఏప్రియల్ 2020 (21:35 IST)
భారతదేశం నుంచి ఉన్నత విద్య కోసం యూకే వెళ్ళిన 300 మంది విద్యార్థులు కరోన విస్తృతితో తీవ్ర భయాందోళనలో ఉన్నారని.. వారిని ఆదుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి శ్రీ ఎస్.జైశంకర్‌కు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ట్విటర్ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ పంపించారు. 
 
అక్కడ చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు తమ సమస్యను జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పందించి కేంద్ర మంత్రికి లేఖ రాశారు. “కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. మీ దృష్టికి యూకేలో చిక్కుకున్న వారి బాధలు తీసుకు వస్తున్నాను. 
 
స్వదేశానికి వచ్చేయడానికి ప్రయత్నించిన ఆ విద్యార్థులు యూకే విమానాశ్రయాల్లో, లండన్ లోని హై కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉండిపోవడంతో... వారు స్వదేశానికి వచ్చే మార్గం లేకుండాపోయింద”ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గత 12 రోజులుగా వారికి సరైన ఆహారం, వసతి లేక ఇబ్బందులుపడుతున్నారన్నారు. 
 
వైరస్ వ్యాప్తితో మరింత భయాందోళనలకు లోనవుతున్నారని, మన విదేశీ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించి తగిన ఆహార, వసతి సదుపాయాలు కల్పించాలని కోరారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ వి.మురళీధరన్ దృష్టికీ ఈ సమస్యను తీసుకువెళ్లారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు