ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత ఓ మహిళా కానిస్టేబుల్కు సీమంతం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హోం మంత్రి ఈ సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖపట్టణంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ వి.రేవతి సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భవతి రేవతికి సీమంతం సారె, పండ్లు, పూలు, పసుపు కుంకుమ, గాజులు అందజేశారు.
ఈ సందర్భంగా హోం మంత్రి అనితను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. హోదాలు మరిచి, పదవీ అహంకారాలను విడిచి సాటి మహిళను గౌరవించే గొప్ప సంప్రదాయానికి హోం మంత్రి అనిత నాంది పలికారని పలువురు కొనియాడుతున్నారు. ఈ వీడియోను టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సోషల్ మీడియాలో షేర్ చేసి హోం మంత్రి అనితను ప్రత్యేకంగా అభినందించారు.