హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పని మంచిదే : డిప్యూటీ సీఎం పవన్

ఠాగూర్

గురువారం, 5 సెప్టెంబరు 2024 (08:51 IST)
హైదరాబాద్ నగర పరిరక్షణ కోసం హైడ్రా చేపడుతున్న కూల్చివేతలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్థించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన చర్యలు సమర్థనీయమని చెప్పారు. గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వెలసిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఈ వ్యవస్థ కబ్జాదారుల పాలిట సింహస్వప్నంలా మారింది. 
 
తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు గురించి మాట్లాడుతూ హైద్రా ప్రస్తావన తీసుకువచ్చారు. "బుడమేరు పరీవాహక ప్రాంతం అంతా ఇళ్లు కట్టేశారు. ఈ విషయంలో సంబంధింత యంత్రాంగానికి, మున్సిపాలిటీకి, పంచాయతీలకు బాధ్యత ఉంది. హైడ్రా వంటి వ్యవస్థను తీసుకువచ్చి వీటన్నింటినీ తొలగించవచ్చు. కానీ కొన్ని సమస్యలు వస్తాయి. హైదరాబాద్‌ నగరంలో చెరువులు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కట్టడం చూశాను. ఇబ్బందులు రావా అనుకునేవాడ్ని! అన్నీ కట్టేసిన తర్వాత కూల్చేయడం కాదు... ఇలాంటి వాటిని ముందే నివారించేలా చర్యలు తీసుకోవాలి. 
 
ముఖ్యంగా అధికారులు వాళ్ల బాధ్యతను వాళ్లు నిర్వర్తించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక అక్రమ నిర్మాణాలను కూలగొట్టేస్తామంటున్నారు. ఆయన చేస్తున్నది రైటే. అయితే మనం కూడా ఇలాగే వ్యవహరించాలంటే... అనేక సామాజిక సమస్యలు, సామాజిక ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది' అని పవన్ కళ్యాణ్ వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు