అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న హైడ్రా...

ఠాగూర్

గురువారం, 29 ఆగస్టు 2024 (10:19 IST)
హైదరాబాద్ నగర పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా ఇపుడు అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. నీటి వనరులను ఆక్రమించుకుని పక్కా భవనాలు నిర్మించిన వారికి నోటీసులు జారీచేస్తుంది. ఇప్పటికే 204 భవనాలకు నోటీసులు జారీ చేశారు. వీరిలో రాజకీయ, సినీ రంగాలతో పాటు పలువురు అధికారుల ఇళ్లకు నోటీసులు పంపించారు. 
 
హైదరాబాద్ నగరంలో చెరువులు, నాళాల ఆక్రమణలకు పాల్పడి, అనుమతులు లేకుండా భవనాలు నిర్మించినవారు వణికిపోతున్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీలోని రాయదుర్గం, మాదాపూర్ పరిధిలో ఉండే దుర్గం చెరువు చుట్టూ విలాసవంతమైన భవనాలు నిర్మించినవారు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో మొత్తం 204 ఇళ్లకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడం ఇందుకు కారణంగా ఉంది. నోటీసులు అందుకున్నవారు వణికిపోతున్నారు. కాగా నోటీసులు అందుకున్నవారిలో సినీ, రాజకీయ రంగాలకు చెందినవారితో పాటు కొంతమంది ఐఏఎస్‌లు, ఐఆర్ఎస్ అధికారులకు చెందిన నివాసాలు ఉన్నట్టు తెలుస్తోంది.
 
నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. అధికారులతో రిపోర్టులు తెప్పించుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలనలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ముషీరాద్ నియోజకవర్గం రాంనగర్‌లో ఆక్రమణలను ఆయన పరిశీలించారు. బుధవారం సాయంత్రం రంగనాథ్ పర్యటించారు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించారు. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ గల్లీలో నాలాపై అక్రమంగా భవనాలు నిర్మించారని, మణెమ్మ వీధిలో రోడ్డు ఇరుకుగా మారిపోయిందంటూ అందిన ఫిర్యాదుల పరిశీలన కోసం ఆయన వెళ్లారు. సంబంధిత స్థలాల పత్రాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు