ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం కూల్చివేతకు కుట్ర : చంద్రబాబు ధ్వజం

సోమవారం, 21 ఆగస్టు 2023 (14:56 IST)
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా వ్యవస్థను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సంస్థలను నిర్వీర్యం చేసే ధోరణిని కొనసాగిస్తూ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 
 
ఆయన సోమవారం మాట్లాడుతూ, నియంతలా వ్యవహరిస్తూ తనను స్తుతించే మీడియాకు ప్రాధాన్యతనిస్తూ, వైసీపీ మోసాలను, నీచమైన పనులను బయటపెట్టే ఈనాడులాంటి మీడియాను వేధించి, బెదిరిస్తున్నాడని దుయ్యబట్టారు. తన సొంత వైఫల్యాలు, ప్రజలలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతతో జగన్ నిరాశలో కూరుకుపోయాడని చెప్పారు.
 
అరవై యేళ్లుగా తెలుగు ప్రజలకు సేవ చేసిన మార్గదర్శి వంటి దీర్ఘకాల సంస్థలను జగన్ లక్ష్యంగా చేసుకున్నాడని, ఆ సంస్థ ఖ్యాతిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. సాహిత్యం, విద్యా రంగాల్లో చేసిన సేవలకు గాను రామోజీరావును దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌తో భారత ప్రభుత్వం సత్కరించిందని గుర్తు చేశారు. 
 
ఎంతో ఉన్నత విలువలు కలిగిన రామోజీరావుపై వైసీపీ చేసిన దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. జగన్ ఎన్ని దుష్ట ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదని... ఎందుకంటే చెడు ఎప్పుడూ ఓడిపోతుందని, మంచి ఎప్పుడూ గెలుపొందుతుంటుందని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు