పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగం సక్సెస్... ఐదేళ్లపాటు సేవలు

బుధవారం, 11 డిశెంబరు 2019 (15:51 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ-48 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. స్వదేశీ ఉపగ్రహం రీశాట్-2తో పాటు.. విదేశాలకు చెందిన మొత్తం 9 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టారు. రీశాట్-2 628 కేజీలుగా ఉంది. అలాగే, అమెరికాకు చెందిన ఆరు శాటిలైట్స్, ఇజ్రాయెల్‌, ఇటలీ, జపాన్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సీ48 నింగిలోకి మోసుకెళ్లింది. 
 
సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి పీఎస్‌ఎల్వీ సీ-48 ద్వారా రాడార్‌ ఇమేజింగ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ ‘రీశాట్‌-2బీఆర్‌1’ ప్రయోగాన్ని నిర్వహించారు. శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం కాగా, పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 50వది కావడం మరో విశేషం. 
 
మంగళవారం సాయంత్రం 4.40కు మొదలైన కౌంట్‌డౌన్‌ బుధవారం మధ్యాహ్నం 3:25 గంటల వరకు కొనసాగింది. 628 కిలోల బరువున్న రిశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. ఐదేళ్ళపాటు ఇది సేవలు అందించనుంది. గత మే 22న ప్రయోగించిన రిశాట్‌-2బీకి కొనసాగింపుగా దీన్ని ప్రయోగిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు