జగన్ మోహన్ రెడ్డికి జైలు భయం- కేసీఆర్ దుర్మార్గం: సిపిఐ నారాయణ

శనివారం, 5 జూన్ 2021 (16:58 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డికి జైలు భయం పట్టుకుందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ. బెయిల్ ఏ క్షణమైనా రద్దు కావచ్చన్న ఆందోళన జగన్‌లో ఉందన్నారు. అందుకే కేంద్రప్రభుత్వానికి ఒకవైపు భజన చేస్తూ మరోవైపు లోలోపల వణికిపోతున్నాడని అన్నారు. 
 
దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తుంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎందుకు సరిగ్గా స్పందించడం లేదంటూ ప్రశ్నించారు సిపిఐ నారాయణ. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా లేకపోవడం.. వెంటిలేటర్ల కొరత అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కనిపిస్తోందన్నారు. ఎపిలోను కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని.. ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్నారు.
 
దేశంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు నారాయణ. అలాగే అవసరమైన ఆక్సిజన్ సదుపాయాన్ని, కరోనా రోగులకు బెడ్లను అందజేయాలన్నారు. కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమ సొంత డబ్బులను ఖర్చుపెట్టి హోం ఐసోలేషన్లో ఉన్న వారికి కడుపునిండా భోజనం పెడుతుందన్నారు. 
 
స్వచ్ఛంద సంస్థలను చూసైనా ప్రభుత్వం నేర్చుకోవాలని.. ప్రభుత్వ ఆసుపత్రులలో పూర్తిగా సౌకర్యాలు కరువయ్యాయన్నారు. కరోనా మృతుల సంఖ్య రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణాలో ఈటెల రాజేందర్ పైన టిఆర్ఎస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.
 
కెసిఆర్ దుర్మార్గాన్ని తట్టుకోలేక చాలామంది టిఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని.. అసలు తెలంగాణా రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారెవరూ ఇప్పుడు ఆ పార్టీలో లేరన్నారు. రానున్న కాలంలో బిజెపి వర్సెస్ టిఆర్ఎస్‌గా మారే అవకాశం ఉందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు