ఎవరి కళ్ళలో ఆనందం కోసం అర్చకుడిపై వైకాపా నేత దాడి చేశారు : పవన్ కళ్యాణ్ ప్రశ్న

బుధవారం, 9 ఆగస్టు 2023 (16:17 IST)
ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి అర్చకుడిపై వైకాపా నేత దాడి చేశారంటూ జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. భీమవరంలోని పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడిపై వైకాపా నేత ఒకరు దాడి చేసి... యజ్ఞోపవీతాన్ని తెంచేసి అవమానపరిచారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎవరి కళ్ళలో ఆనందం కోసం దాడి చేశారని ప్రశ్నించారు. యథా నాయకుడు.. తథా అనుచరుడు అనేలా వైకాపా వాళ్ళు తయారయ్యారంటూ విమర్శలు గుప్పించారు.
 
ఇది పాలక వర్గం అహంభావానికి, దాష్టీకానికి ప్రతీక అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బోర్డు ఛైర్మన్ భర్త యుగంధర్ చేసిన దాడిని సనాతన ధర్మంపై దాడిగా భావించాలని, ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన కోరారు. అర్చకులపై దాడి చేయడం, వారిని ఇబ్బంది పెట్టడం రాక్షస చర్యతో సమానమన్నారు. పవిత్ర ఆలయ ప్రాంగణాల్లో అధికార దర్పం చూడం క్షమార్హం కాదన్నారు. ఈశ్వరుని సన్నిధిలో అర్చకుడిపై దాడి చేసి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు