వైకాపా ఓటమికి రాజధాని అమరావతి కూడా ఓ కారణం : జోగి రమేశ్

ఠాగూర్

ఆదివారం, 8 జూన్ 2025 (11:53 IST)
గత ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి రాజధాని అమరావతి కూడా ఓ కారణమని మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేశ్ అన్నారు. తాజాగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యలో ఆయన మాట్లాడుతూ, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాజధాని విషయంలో తమ పార్టీ పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై తమ పార్టీ అధినేతతోనూ చర్చిస్తామని అన్నారు. 
 
గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే మూడు రాజధానులను తీసుకువచ్చారని చెప్పారు. కానీ అది రాష్ట్ర ప్రజలకు నచ్చలేదని అన్నారు. తమ పార్టీ ఓటమికి అమరావతి అంశం కూడా ఒక కారణంగా ఆయన పేర్కొన్నారు.
 
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని జోగి రమేశ్ చెప్పుకొచ్చారు. తమ పార్టీ నాయకుడు జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. తాము చెప్పినట్లుగా చంద్రబాబు కూడా విశాఖ ఆర్థిక రాజధాని అంటున్నారని గుర్తుచేశారు. తాము ఆశించినట్లే ఇప్పుడు విశాఖను ఒక రాజధానిగా కూటమి ప్రభుత్వం చేసిందన్నారు.
 
అక్కడ కూడా పెట్టుబడులు వచ్చి అభివృద్ధి చేయాలన్నదే తమ పార్టీ ఉద్దేశంగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని జగన్ చాలా సార్లు చెప్పారన్నారు. అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీకృతం కావొద్దనేదే జగన్ ఉద్దేశమని, అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని జగన్ చూశారని జోగి రమేశ్ అన్నారు. ప్రస్తుతం జోగి రమేష్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు