వైఎస్ కుమార్తె షర్మిలమ్మకు కొండపల్లి బొమ్మ, రెడ్డి సంఘం మద్దతు

సోమవారం, 22 మార్చి 2021 (20:34 IST)
కృష్ణాజిల్లా, జి.కొండూరు: ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రచార కార్యదర్శి, వైఎస్ఆర్ యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇరుగుల రాజశేఖర్ రెడ్డి సోమవారం హైదరాబాదులో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలమ్మను కలిశారు. కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు మండలం మునగపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా షర్మిలమ్మకు కొండపల్లి బొమ్మను ప్రత్యేకంగా బహుకరించారు.

ఆయన మైలవరం విలేకరులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ తెలంగాణలో  షర్మిలమ్మ పెడుతున్న రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను షర్మిలమ్మ సాధిస్తుందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆమె నెరవేరుస్తుందని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. షర్మిలమ్మ పెట్టబోయే రాజకీయ పార్టీ బలోపేతం కోసం తమ వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.... వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ పథకాలను, నవరత్నాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
 
తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు విముఖతతో ఉన్నారని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు వైయస్ రాజశేఖర్రెడ్డి తరహాలో సమర్థవంతమైన, సంక్షేమ పాలన అందించడం షర్మిలమ్మకే సాధ్యం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత నేత మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జనరంజకంగా పరిపాలన చేశారన్నారు. ఆనాటి వైయస్ తరహా పాలన కోసం...నేడు తెలంగాణ ప్రజలంతా షర్మిలమ్మ వైపు చూస్తున్నారని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు