ప్రేమలో ఓడిపోయాం.. పురుగుల మందు తాగి చనిపోతున్నాం.. కృష్ణగిరిగుట్టపై?

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (09:00 IST)
ప్రేమికుల దినోత్సవానికి ముందు రోజు ఆ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తాము ప్రేమలో ఓడిపోయామంటూ ఆ జంట మనస్తాపానికి గురైంది. దీంతో పురుగుల మందు తాగి ఆ జంట ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం దుద్యాల సమీపాన సోమవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడకు చెందిన మధు(22), ఓ యువతి (16) ప్రేమికులు. కొన్నిరోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అపహరణ కేసు కింద మధును రిమాండుకు తరలించారు.
 
మధు రిమాండ్‌కు వెళ్లగానే.. అదే గ్రామానికి చెందిన మల్లేష్ (వరుసకు బావ)తో యువతికి పెళ్లిచేసి, పిట్టలగూడలోనే కాపురం పెట్టారు. శనివారం రాత్రి ఇంట్లో భోజనంచేసి నిద్రించిన యువతి... ఆదివారం తెల్లారేసరికి కనిపించలేదు. దీంతో మధుపై అనుమానం వ్యక్తంచేస్తూ యువతి కుటుంబ సభ్యులు నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీరిద్దరి మృతదేహాన్ని సోమవారం సాయంత్రం దుద్యాల సమీపంలోని కృష్ణగిరిగుట్టపై కనుగొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. తాము పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఫోనులో మధు చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

వెబ్దునియా పై చదవండి