మంచు ఫ్యామీలీలో మళ్లీ రచ్చ వెలుగులోకి వచ్చింది. మరోసారి మంచు మనోజ్ మళ్లీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్లో సోదరుడు మంచు విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కుమార్తె బర్త్ డే నేపథ్యంలో తన కుటుంబం రాజస్థాన్ వెళ్లిందని.. ఆ సమయంలో తన ఇల్లు ధ్వంసం చేశారని తన ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారు. తన ఇంటి నుంచి చోరీ అయిన కార్లు విష్ణు కార్యాలయంలో లభ్యమైనాయని పేర్కొన్నారు. తన ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకొని వెళ్లారని చెప్పారు. తాను ఇంట్లో లేని సమయంలో తన కారుతోపాటు వస్తువులను సైతం దొంగిలించాడని తెలిపారు.
జల్పల్లిలోని ఇంటిలో సైతం 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని ఆ ఫిర్యాదులో స్పష్టం చేశారు. తన ఇంటిలోని విలువైన వస్తువులతోపాటు కార్లను కూడా ఎత్తుకొని వెళ్లారని మంచు మనోజ్ స్పష్టం చేశారు. తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలను తండ్రి మోహన్ బాబుతో వివరించేందుకు కాల్ చేస్తే ఆయన అందుబాటులో లేరని చెప్పారు. ఈ కేసులో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.
అలాగే జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మోహన్ బాబు ఇంట్లోకి మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన బయటే బైఠాయించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మోహన్బాబు ఇంటికి 2 కిలో మీటర్ల నుంచి ఆంక్షలు విధించారు.
అయినా జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంచు మనోజ్ ఆందోళనకు దిగారు. తన ఇంట్లోని కారు, వస్తువులను అపహరించారని మనోజ్ ఆరోపించారు. మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదని చెప్పారు. దీంతో జల్పల్లి ఇంటి గేటు వద్ద మనోజ్ బైఠాయించారు.