జగన్ కట్... అమిత్ షా ఓకే.. బాబుకు ఎన్‌ఎస్‌జీ కొనసాగింపు.. మర్మమేంటో?

శుక్రవారం, 26 జులై 2019 (14:59 IST)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఎన్ఎస్‌జీ భద్రత కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనకు ఇప్పటికీ మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నందున జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. 

ఈ వారం మొదట్లో దేశంలోని ప్రముఖుల భద్రతపై హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో మావోయిస్టులు, ఉగ్రవాదులతో పాటు ప్రత్యర్థుల నుంచి చంద్రబాబుకు ముప్పు పొంచి వుందని రాష్ట్ర, జాతీయ నిఘా సంస్థలు ఇచ్చిన నివేదిక మేరకు ఎన్ఎస్‌జీ భద్రతను కొనసాగించాలని హోంశాఖ నిర్ణయించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మావోయిస్టుల ఏరివేతతో పాటు ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేసే చర్యలను చేపట్టడంతో వారు ఆయనపై పగబట్టారు. ఈ క్రమంలో 2003లో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళుతుండగా అలిపిరి వద్ద పీపుల్స్‌వార్ గ్రూప్‌కు చెందిన నక్సలైట్లు శక్తివంతమైన ల్యాండ్‌మైన్లు పేల్చారు. ఈ దాడిలో బాబు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. నాటి నుంచి ఆయనకు దేశంలోనే అత్యున్నత స్థాయి జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను అందిస్తున్నారు. 
 
కాగా.. జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు భ్రదతను కుదించారు. దీనిపై చంద్రబాబు హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆయనకు ఎన్ఎస్‌జీ భద్రతను కొనసాగించడం గమనార్హం.
 
మరోవైపు చంద్రబాబుకు జడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వం.. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, మీరా కుమార్ తదితరుల భద్రతను తగ్గించింది. చంద్రబాబుకు ఎన్.ఎస్.జి భద్రత కొనసాగింపు వెనుక గల మర్మమేంటో అంతుచిక్కడం లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు