తల్లికి వందనం పథకానికి సంబంధించి గత ప్రభుత్వం ఏ నిబంధనలైతే అమలు చేసిందో, అవే నిబంధనలను తాము కూడా పాటిస్తున్నామని, కాబట్టి ఈ పథకంపై తమను ప్రశ్నించే నైతిక హక్కు వైసీపీ వాళ్లకు లేదని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
'బాబు సూపర్ సిక్స్' హామీల్లో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తల్లికి వందనం' పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లను జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. గత విద్యాశాఖ మంత్రికి కనీస పరిజ్ఞానం కూడా లేదని, యూడైస్ డేటాలో ప్రీప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లల వివరాలు కూడా కలిపి తప్పుడు లెక్కలు చూపారని లోకేష్ ఆరోపించారు.
తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. ఒకటో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల్లో చేరిన తర్వాత కూడా వారి తల్లుల ఖాతాల్లోకి నిధులు జమచేస్తామని తెలిపారు. తల్లి లేని పిల్లలకు తండ్రి లేదా సంరక్షకుల ఖాతాల్లో, అనాథాశ్రమాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ల ద్వారా నిధులు చేరతాయని స్పష్టం చేశారు.