ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

ఠాగూర్

బుధవారం, 11 జూన్ 2025 (21:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక యేడాది పూర్తయింది. ఈ శుభ సందర్భంగా మరో కొత్త పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు అంతమంది ఉన్నా వారిలో ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున డబ్బులు ఇవ్వనున్నట్టు విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ తెలిపారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా, తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఆర్థిక సహాయం జమ చేయనున్నట్టు ఆయన బుధవారం వెల్లడించారు. 
 
ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. వీరి తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం మొత్తం రూ.8745 కోట్ల జమ చేయనుందన్నారు. ఒకటో తరగతి అడ్మిషన్ పొందే చిన్నారులతో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఒక కుటుంబలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు