'స్థానిక' ఎన్నికల బాధ్యత మంత్రులదే: జగన్‌

గురువారం, 5 మార్చి 2020 (07:42 IST)
స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, జిల్లా మంత్రులదేనని సీఎం జగన్‌ పేర్కొన్నట్లు సమాచారం. మంత్రులతో సీఎం జగన్‌ ఆసక్తికర చర్చ జరిపారు. కేబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత జగన్‌ మంత్రులకు పలు సూచనలు చేశారు. 

‘‘స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఓటమి పాలైతే, అందుకు బాధ్యులైన మంత్రులు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి తమ రాజీనామా పత్రాలను గవర్నర్‌కు అందజేయాల్సి  ఉంటుంది. నియోజకవర్గాల పరిధిలో ఓటమికి సంబంధిత శాసనసభ్యులు బాధ్యత వహించాలి.

వారు తమ రాజకీయ భవిష్యత్తును కోల్పోవాల్సిందే. వచ్చే ఎన్నికల్లో వారికి వైసీపీ టికెట్‌ రాదు. పదవులపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు’’ అని జగన్‌ పేర్కొన్నట్లు సమాచారం.

జిల్లాల్లో గ్రూప్‌ తగాదాలను సరిదిద్దాలని మంత్రులకు సూచించారు. మద్యం, డబ్బు పంపిణీ లేకుండా స్థానిక సంస్థలకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం.

మంత్రుల పనితీరుపై తన దగ్గర సర్వే రిపోర్టు ఉందని జగన్‌ చెప్పారు. ఫలితాల్లో తేడా వస్తే రాజీనామా చేయాల్సిందేని జగన్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చేది ఉండదని వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది.

ఈ నెల 8 వరకు కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ నెల 9 నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు