నీతి నిజాయితీతో పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారితో ఒక్కరోజు పనిచేసినా చాలు: తాతాజీ

ఐవీఆర్

ఆదివారం, 20 అక్టోబరు 2024 (13:13 IST)
జనసేన పార్టీ పెట్టిన దగ్గర్నుంచి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కల్యాణ్ గారు... తను చెప్పిన మాటలకు కట్టుబడి నీతి-నిజాయితీగా పనిచేస్తున్నారని అమలాపురంకి చెందిన కల్వకొలను తాతాజీ అన్నారు. ఇలాంటి నాయకుడితో ఒక్కరోజు పనిచేసినా చాలు అన్నారు తాతాజీ. లంచం తీసుకునే అధికారులు కానీ నాయకులు కానీ తనకు వద్దని బహిరంగంగా చెబుతున్న పవన్ కల్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి అందరూ ఇదేవిధంగా మద్దతు ఇస్తుంటే రాబోయే 2029లో కూడా కూటమిదే అధికారం అని జోస్యం చెప్పారు తాతాజీ.
 
జనసేన పార్టీలో వైసీపీ నుంచి నాయకులు చేరారు. శనివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు నాయకులు ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరారు. రాజమండ్రికి చెందిన శ్రీమతి  క్రాంతి దంపతులు, అమలాపురంకి చెందిన శ్రీ కల్వకొలను తాతాజీ, గుంటూరుకు చెందిన శ్రీ చందు సాంబశివరావు పార్టీలో చేరారు. వీరికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీమతి క్రాంతి... వైసీపీ నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం కుమార్తె.
 
గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు శ్రీ నిమ్మల వెంకట రమణ, శ్రీ సంకూరి శ్రీనివాసరావు, శ్రీమతి ఇర్రి ధనలక్ష్మి, శ్రీమతి అయిశెట్టి కనకదుర్గ పార్టీలో చేరారు. జగ్గయ్యపేట మున్సిపాలిటి కౌన్సిలర్లు శ్రీ కొలగాని రాము, శ్రీమతి కాశీ అనురాధ, శ్రీ తుమ్మల ప్రభాకర్ రావు, శ్రీమతి కాటగాని శివ కుమారి, శ్రీమతి తన్నీరు నాగమణి , శ్రీ సాధుపాటి రాజా, శ్రీమతి పాకలపాటి సుందరమ్మ, శ్రీ షేక్ సిరాజున్, శ్రీమతి మోరే సరస్వతి, శ్రీ పండుల రోశయ్య, కోఆప్షన్ మెంబర్లు శ్రీ చైతన్య శర్మ, శ్రీ ఖాదర్ బాషా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీ ఆకుల బాజీ, శ్రీ వీరయ్య చౌదరి పార్టీలో జాయిన్ అయ్యారు. పెడన నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ శ్రీ జక్కా ధర్మారాయుడుతోపాటు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు, నాయకులు పార్టీలో చేరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు