కాకినాడ జనసేన లోక్‌సభ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

ఠాగూర్

బుధవారం, 20 మార్చి 2024 (08:49 IST)
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గతంలో పలు ఐటీ కంపెనీల్లో పని చేసిన ఉదయ్... దుబాయ్‌లో ఉద్యోగం మానేసి వచ్చి టీ టైమ్ కంపెనీతో రాణిస్తున్నారు. ఆ వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఇపుడు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఇపుడు జనసేన పార్టీలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఈ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. 
 
ఉదయ్ గురించి విశేషాలు చూస్తే మనోడు సామాన్యుడు కాదు అనే రేంజిలో ఉన్నాయి. దుబాయ్‌లో కళ్లు చెదిరే జీతంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేసి, భారత్ వచ్చి 'టీ టైమ్' పేరిట దేశవ్యాప్తంగా టీ షాపుల చెయిన్ ప్రారంభించి, కోట్ల రూపాయల టర్నోవర్‌తో యువ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందాడు. ఉదయ్ 2006లో హైదరాబాదులోని టీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత పలు ఐటీ సంస్థల్లో పనిచేశాడు. చివరిసారిగా దుబాయ్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఖరీదైన జాగ్వార్ కారు, లగ్జరీ విల్లా... ఇలా అక్కడ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు.
 
అయితే, 29 ఏళ్ల వయసులో సొంతంగా ఏదైనా సాధించాలన్న తపనతో ఉద్యోగం వదిలేశాడు. లక్షల్లో వేతనం అందుకుంటున్న దశలో ఒక్కసారిగా ఉద్యోగం మానేయడంతో అతడి కుటుంబం ఏమాత్రం హర్షించలేకపోయింది. భారత్ వచ్చిన అనంతరం టీ టైమ్ పేరిట దేశవ్యాప్త గొలుసుకట్టు దుకాణాలతో కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో ఉదయ్‌కు సపోర్ట్‌గా నిలిచింది భార్య బకుల్ ఒక్కరే నిలిచారు. ఆమె ఓ ఆయుర్వేదిక్ డాక్టర్. భార్య ప్రోత్సాహంతో వ్యాపార రంగంలోకి దిగిన ఉదయ్ అనుకున్నది సాధించారు.
 
"టీ టైమ్" ఐడియా వర్కౌట్ కావడంతో ఉదయ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. 2016లో రూ.5 లక్షల పెట్టుబడితో రాజమండ్రిలో తొలి టీ దుకాణం స్థాపించగా... ఇప్పుడు టీ టైమ్ టీ ఫ్రాంచైజీల సంఖ్య 3 వేలకు పెరిగింది. టీ టైమ్ ప్రైవేట్ లిమిటెడ్ టర్నోవర్ రూ.35 కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు