ఎన్నికల తర్వాత వంగ గీత జేఎస్పీలోకి రావడం ఖాయం.. పవన్ కల్యాణ్

సెల్వి

మంగళవారం, 19 మార్చి 2024 (21:35 IST)
వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేయనున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా కాకినాడ మాజీ ఎంపీ వంగ గీతను ప్రకటించి, ఇక్కడ పవన్‌ను ఓడించేందుకు కార్యాచరణ సిద్ధం చేసే పనిలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రంగంలోకి దింపారు వైఎస్ జగన్.
 
దీనిపై పవన్ మాట్లాడుతూ.. "వంగగీత గారు తన రాజకీయ జీవితాన్ని పీఆర్పీతో ప్రారంభించి, ఇప్పుడు పీఠాపురంలో నాకు వ్యతిరేకంగా నిలబడి ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత ఆమె వైసీపీని వీడి జేఎస్పీలోకి రావడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ అంతటా మా పనితీరు ఇలాగే ఉంటుంది.." అని పవన్ కళ్యాణ్ అన్నారు.
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళవారం పిఠాపురం నియోజకవర్గం నుంచి పలువురు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పిఠాపురంకు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్న ఆయన.. కేవలం అక్కడి నుంచి పోటీ చేస్తున్నందుకే తాను చేసిన ప్రకటన కాదని స్పష్టం చేశారు.
 
 
 
పిఠాపురం శ్రీపాద వల్లభ స్వామి జన్మస్థలమని, సమైక్య తూర్పుగోదావరి జిల్లాలో విశిష్టమైన ప్రాంతమని పవన్ కల్యాణ్ సూచించారు. గెలవడమే తన ఉద్దేశ్యమైతే గత ఎన్నికల్లోనే ఇక్కడి నుంచి పోటీ చేసి ఉండేవాడినని వెల్లడించారు. గాజువాక, భీమవరంతో పాటు పిఠాపురం తనకు కళ్లలాంటివని పేర్కొన్నారు.
 
 
 
"ఇక నుంచి పిఠాపురం నా స్వస్థలం. నేను ఇక్కడే ఉంటాను... రాష్ట్ర పరిస్థితిని, దిశను మార్చేందుకు ఇక్కడి నుంచే కృషి చేస్తాను. పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్‌ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే ఆశిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒక్కసారి ఎమ్మెల్యేగా నా పనితీరు చూస్తే నన్ను వదలరు" అని పవన్ కల్యాణ్ వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు