రాష్ట్రానికి మరో 15 యేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని కోరుకుంటున్నానని, ఆయన నాయకత్వంలో పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఏపీ డిప్యూటీ, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన శాసనసభ్యులు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు.
మోషన్ రాజు, రఘురామకృష్ణంరాజు, కమిటీ సభ్యులకు, క్రీడా శాఖాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు క్రికెట్, టెన్నిస్, షటిల్, వాలీబాల్, కబడ్డీ అథ్లెటిక్స్, టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడల్లో గెలుపొందిన సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. పార్టీలకు అతీతంగా సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఏపీ క్రీడా సాధికార సంస్థ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. క్రీడా మైదానంలో ఏర్పాట్లు, క్రీడా సామాగ్రి, క్రీడాకారుల సౌకర్యాల కోసం వారు చేసిన కృషి అభినందనీయమన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవాన్ని ఉపయోగించుకుని, ఆయన నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కనీసం 15 యేళ్లు నిరంతరం కృషి చేయాలని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు అనుభవనాన్ని పక్కన పెట్టలేమని, ఆయన నాయకత్వంలో పని చేయడానికి తాను ఎల్లపుడూ సిద్ధంగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు. ఇంటికి వెళ్ళేటపుడు ప్రతి ఒక్కరూ మంచి అనుభవాలను తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.